హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి ఆశించినంతగా సహకారం అందడంలేదు. ఇప్పటివరకు వ్యాక్సిన్ల విషయంలో తెలంగాణకు అవసరమైనంత మేర సరఫరా చేయని కేంద్రం.. ఇప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్గా చెప్పుకొనే టోస్లిజుమాబ్ ఇంజెక్షన్ల విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తున్నది. దేశంలో ఈ మందు కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో స్విస్ డ్రగ్ తయారీ సంస్థ రోష్ నుంచి టోస్లిజుమాబ్ను దిగుమతి చేసుకొని రాష్ర్టాలకు పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మందు ధర లక్షల్లో ఉండటం, కొవిడ్ చికిత్సలో మంచి ఫలితాన్ని ఇస్తుండటంతో తమకు ఎక్కువ కేటాయించాలని చాలా రాష్ర్టాలు కోరుతున్నాయి. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణకు అతి తక్కువగా కేటాయింపులు ఉండటం గమనార్హం.
రాష్ర్టానికి 675 వయల్స్
కేంద్రం వివిధ రాష్ర్టాలకు మొత్తం 45 వేల టోస్లిజుమాబ్ వయల్స్ (80ఎంజీ)ను కేటాయించింది. ఇందులో 5 వేల వయల్స్ను కేంద్ర ఆరోగ్య సంస్థలకు, 40 వేల వయల్స్ను రాష్ర్టాలకు కేటాయించింది. అత్యధికంగా మహారాష్ట్రకు 6,380 వయల్స్ను కేటాయించగా.. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (6,150), కేరళ (4,500), ఉత్తర్ప్రదేశ్ (2,420), రాజస్థాన్ (2,185), ఆంధ్రప్రదేశ్ (2,040) ఉన్నాయి. తెలంగాణకు అత్యల్పంగా 675 వయల్స్ మాత్రమే కేటాయించింది. ఇందులో ఇప్పటివరకు రాష్ర్టానికి సుమారు 80 వయల్స్ వచ్చాయి. వాటిలో ప్రభుత్వ కమిటీ సూచన మేరకు దాదాపు 20 వయిల్స్ పంపిణీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
వ్యాక్సిన్ల పంపిణీలోనూ వివక్షే
వ్యాక్సిన్ల పంపిణీ విషయంలోనూ తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నది. ఇప్పటివరకు రాష్ర్టానికి 55 లక్షల డోసులను మాత్రమే పంపింది. మొత్తం డోసుల్లో 60 శాతానికిపైగా డోసులను 8 రాష్ర్టాలకే అందించింది. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత కారణంగా రెండో డోసు వారికి మాత్రమే టీకా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరో రెండు రోజులకు సరిపడే వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తేనే వ్యాక్సినేషన్ ముందుకు వెళ్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు.
అందుకే గ్లోబల్ టెండర్లు
ఓవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తుండటం, మరోవైపు 18-44 ఏండ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీకాల కోసం వేట మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వంపై ఆశలు వదులుకొని రాష్ట్రంలో కనీసం కోటిన్నర మందికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మార్గాలు వెతుకుతున్నది. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున 3 కోట్ల డోసుల వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించబోతున్నది. ఇందుకు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుచేయనున్నట్లు తెలుస్తున్నది. కొవాగ్జిన్, కొవిషీల్డ్తోపాటు అనుమతి పొందిన ఇతర వ్యాక్సిన్లను కొనుగోలుచేసి, అందరికీ అందించడమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి కొరత లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.