హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ):యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి అద్భుతంగా బంగారు తాపడం చేయిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ ‘స్వామివారి గర్భగుడిపైన ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం తిరుమలలో చేసిన వారిని మన అధికారులు సంప్రదించారు. అతి త్వరగా కావాలంటే కొంత తక్కువ బంగారంలో తొందరగా అవుతుందని, లేదు తిరుమల మాదిరిగానే.. అదే ప్రమాణాలతో కావాలంటే కొంత ఎక్కువ సమయం, ఎక్కువ బంగారం పడుతుందని వారు చెప్పారు. మేము తిరుమల మాదిరిగా కావాలె.. అవసరమైతే అంత కన్నా మంచిగ కావాలని చెప్పినం. దానికి వారు స్పందిస్తూ.. తమకు కొంత సమయం పడుతుందని చెప్పారు.
మీరు ఇక్కడే ఉండి మీ పర్యవేక్షణలో ఇక్కడే చేయమంటే ఇక్కడే చేస్తాం.. లేదంటే మరో రకంగా చేస్తామన్నారు. దీనికి వారు వేసిన బంగారం అంచనా. 125 కిలోలు. సంతోషంగా చేయించాలని నిర్ణయించాం. డబ్బు రూపంలో దాని విలువ చూస్తే రూ.60 కోట్ల దాకా అవుతుంది. ఇంత చేసిన వాళ్లం, ప్రభుత్వం అనుకుంటే చేయవచ్చు. కానీ, ఇటీవల శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ ప్రస్తావన తెచ్చా. వాళ్లేమన్నారంటే.. ‘యావత్ తెలంగాణ ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవాలనుకుంటరు. ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని ఇన్వాల్వ్ చేద్దాం’ అన్నరు. ప్రజలందరు తమదిగా భావించి, ఒక ఎమోషన్లో కదిలి వచ్చే ప్రయత్నం చేద్దామన్నరు.
కలిగిన వారు కలిగినంత ఇంత ఎక్కువ, తక్కువ అని లేదు. వ్యక్తులుగా ఇవ్వొచ్చు, గ్రామాలుగా ఇవ్వొచ్చు. మనకు 12,769 గ్రామ పంచాయతీలు, 3,600 పైచిలుకు మున్సిపల్ వార్డులు ఉన్నాయి. 142 మున్సిపాలిటీలు, హైదరాబాద్ వంటి మహానగరం ఉంది. మన వాళ్లు కోరింది ఏంటంటే.. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైంత వాళ్లు సమర్పించాలి. వీసమెత్తో, గుంజెత్తో.. పావుతులం అయినా ఫర్వాలేదు వాళ్లను ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ల వాళ్ల గ్రామాల్లో నృసింహ పూజ కార్యక్రమాలు చేసి డబ్బు రూపంలో తెచ్చి కమిటీ వారికి అప్పజెప్పాలి. ఈ బంగారం కూడా అక్కడిక్కడ మార్కెట్లో కొనడానికి ఉండదు. మేలైన బంగారం కావాలి. సరైన పద్ధతిలో రావాలి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొనాలని నిర్ణయించాం. పిచ్చి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం లేదు. ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తే మనకు నిఖార్సయిన బంగారం లభ్యమవుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. కమిటీ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. అందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో ఉంటరు. తిరుమలలో ఎలా చేసుకున్నమో మనం అలా చేసుకున్నైట్లెతే అది శాశ్వతంగా, గొప్పగా ఉండిపోయే అవకాశం ఉంటుంది’ అని సీఎం చెప్పారు.
మొదటి విరాళం మా కుటుంబం నుంచి కిలో 16 తులాలు
విరాళం ఇచ్చేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తున్నారు. దానికి నేనుగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. మొట్టమొదటి విరాళం అందించే కార్యకర్తగా ఒక కిలో 16 తులాల బంగారం మా కుటుంబం నుంచి సమకూర్చాలని నిర్ణయించాను. రెండు, మూడు రోజుల్లో ఆ చెక్ను కూడా అందజేస్తాను. మా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముందుకు వచ్చి తన కుటుంబం నుంచి ఒక కిలో, మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారాన్ని సమర్పిస్తామని ప్రకటించారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి జీయర్ స్వామి సమక్షంలో లక్ష్మీ అమ్మవారి యాగాలు చాలా చేశారు. వారు ముందుకు వచ్చి మా వద్ద ఉన్న రెండు పెద్ద సంస్థల తరుపున రెండు కిలోల బంగారం వెంటనే అందజేస్తామని ముందుకు వచ్చారు.
భక్తి తత్పరులు కావేరీ భాస్కర్ రావు ఒక కిలో ఇస్తామని ముందుకు వచ్చారు. పెద్దలు దీవకొండ దామోదర్రావు తన కుటుంబం తరఫున కేజీ బంగారం ఇస్తామని ముందుకు వచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఇలా చాలా మంది ఫోన్ చేశారు.. మాది ప్రకటించాలన్నరు. జీయర్స్వామి వారు జీయర్ పీఠం నుంచి ఒక కిలో బంగారం ఇస్తామన్నరు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా కుటుంబం నుంచి ఇస్తాం, మా నియోజకవర్గం నుంచి కూడా మీరు కోరిన పద్ధతిలో సేకరణ చేసి ఇస్తామన్నరు. నాకు తెలిసి కొంచెం ఎక్కువనే వచ్చే అవకాశం కనిపిస్తున్నది. తెలంగాణ ఆధ్యాత్మికత పండిన నేల అని చెప్పేందుకు పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలు తార్కాణం. భక్తి తత్పరులు, స్వామి పట్ల భక్తి భావం ఉన్నవారు చాలామంది ఉన్నరు.
ఇంక చాలా మంది ముందుకు వస్తరు. బంగారం ఇవ్వక్కర్లేదు, గ్రామం నుంచి రూ.11 ఇచ్చినా చాలు. ఈ మధ్య మేము 4,000 గిరిజన తండాలను పంచాయతీలు చేసినం. వారి మీద ఏం బలవంతం ఉండదు. భాగస్వాములు కావాలని కోరుతున్నం అంతే. వారు ఎంత ఇచ్చినా దాన్ని కూడా బంగారం కొనే డబ్బులో కలిపేసి కొంటం. ఈ రాష్ట్రం మాది, ఈ ఆలయం మాది, ఈ ఆధ్యాత్మిక సంపద మాది అనే ఆలోచన యావత్ తెలంగాణకు రావాలి అనే గొప్ప భావనను అందరూ కలిగి ఉండాలి. ఏకోన్ముఖంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. దానిలో భాగంగానే ప్రకటిస్తున్నా.
రెండు రకాలుగా అండర్ డ్రైనేజీ
యాదాద్రిలో అద్భుతమైన కట్టడాలు ఇంకా వస్తాయి. లక్షల సంఖ్యలో భక్తులు విశేషంగా తరలివస్తారు కాబట్టి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా అవసరం. రేపు, ఎల్లుండి జలమండలి అధికారులను ఇక్కడికి పంపిస్తాం. రెండు రకాల డ్రైనేజీలు నిర్మించాల్సిన అవసరమున్నది. టెంపుల్ సిటీ, పాత గుట్ట, యాదాద్రి మున్సిపల్ పరిధి, స్వామి వారు ఉండే పుణ్యక్షేత్రం అంతటా అండర్ డ్రైనేజీ విధానం, వరద నీరు పోవడానికి డ్రైనేజీలను నిర్మించాల్సి ఉంటుంది. ఎస్టీపీలను నిర్మిస్తాం. దీనికోసం ఎన్ని వందల కోట్లు అయినా మంజూరు చేస్తాం. దివ్యవైన ధామంగా ఉండాలని ఈ పనులు చేస్తున్నాం.
దేవాలయ ఉద్యోగులు, జర్నలిస్ట్లకు ఇండ్ల స్థలాలు
పేదల గురించి ఆలోచించేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉద్యోగులకు 30% పీఆర్సీ అమలు చేశాం. అన్ని స్థాయిల ఉద్యోగులకు వర్తింపజేశాం. దేవాలయ ఉద్యోగులకు కూడా అమలైంది. వారు ఇండ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు. జిల్లా మంత్రి ఆధ్వర్యంలోనే వారం పది రోజుల్లోనే ఏర్పాటుచేస్తారు. ప్రెస్ వారికి కూడా ఇండ్ల స్థలాలు ఇస్తాం. యాదాద్రి జర్నలిస్ట్ కాలనీని ఏర్పాటు చేసుకుందాం. విలేకరులు వార్తా వాహకులు కాబట్టి మహాకుంభ సంప్రోక్షణ, రాష్ట్రం విశిష్టత గురించి, ఆధ్యాత్మిక సంపదను, దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలి. గుట్ట మీద షాపుల వాళ్లు వాటి మీదనే ఆధారపడ్డారు కాబట్టి వారికి టెంపుల్ టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కల్పిస్తాం. కోల్పోయిన వారు దరఖాస్తులు పెట్టుకొంటే వారికి అవకాశాలు కల్పిస్తారు. టెంపుల్ మీద ఎలాంటి షాపులు ఉండవు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.