హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తున్నది. కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు రామప్ప దేవాలయానికి యునెస్కో ఇటీవలే ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) నిర్వహించే ‘బెస్ట్ టూరిజం విలేజ్’ కాంటెస్ట్కు భారత్ తరఫున తెలంగాణలోని ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామం పోటీపడుతున్నది. ఈ విలేజ్తో పాటు మేఘాలయలో విజిలింగ్ విలేజ్గా ప్రఖ్యాతిగాంచిన ‘కాంగ్థాన్’, మధ్యప్రదేశ్లోని చారిత్రాత్మక గ్రామం ‘లద్పురా ఖాస్’ కూడా పోటీలో ఉన్నాయి.
కాంగ్థాన్
మేఘాలయలో కాంగ్థాన్ గ్రామం ఉన్నది. ఈ గ్రామంలోని ప్రజలందరూ ‘ఈల’ భాషను వాడుతారు. ఇతరుల పేర్లను పిలువడానికి ఈల వేస్తారు. 700 జనాభా కలిగిన కాంగ్థాన్ గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. గర్భందాల్చాక కడుపులో ఉన్న బిడ్డ కోసం కాబోయే తల్లిదండ్రులు ఒక ఈల పాటను సిద్ధం చేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఆ ట్యూన్తోనే ఆ పాపను పిలువాలి. గ్రామంలోని ప్రజలు కూడా ఆ బిడ్డను ఆ ఈల పాటతోనే పిలువాలి. ఈ సంప్రదాయం వెనుక రెండు కారణాలు ఉన్నాయని చెబుతారు. కాంగ్థాన్ ప్రజలకు వ్యవసాయంతో పాటు జంతువుల వేట ప్రధాన వృత్తి. జంతువులను వేటాడేటప్పుడు.. ప్రమాదం పొంచి ఉన్న తోటివారిని అప్రమత్తం చేసేందుకు పేర్లను వాడేవారు. దీంతో మనుషుల గొంతును పసిగట్టిన జంతువులు దాడులకు తెగబడేవి. అందుకే పక్షుల కుహూకుహూ రాగాలకు దగ్గరగా మనుషుల పేర్లను ఈల పాటలతో పిలువడం మొదలుపెట్టారు. మరో వాదన ప్రకారం.. కాంగ్థాన్లో గతంలో క్షుద్ర పూజలు జరుగుతుండేవి. మనుషులను పేర్లతో పిలిస్తే ఆ పేర్లను తెలుసుకొని కొందరు చేతబడి చేసేవారు. అప్పటినుంచి మనుషుల పేర్లను ఇక్కడ వాడట్లేదు.
భూదాన్పోచంపల్లి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామమే భూదాన్పోచంపల్లి. 1951లో మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడు ఆచార్య వినోభాబావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికి ఈ ప్రాంతం నాంది పలికింది. ఇక్కడి భూదాత వెదిరె రామచంద్రారెడ్డి వినోభాబావే పిలుపు మేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ.. సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి సేకరించి భూమిలేని పేదలకు పంచి పెట్టారు. అలా మాములు పోచంపల్లిగా ఉన్న ఈ గ్రామం భూదానోద్యమంతో ‘భూదాన్పోచంపల్లి’గా మారింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలే కాదు.. నాటి నిజాంతోపాటు ఇతర అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన నాటి పోచంపల్లి.. రానురాను ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్ వస్ర్తాలకు మంచి గుర్తింపు ఉంది.
లద్పురా ఖాస్
మధ్యప్రదేశ్లోని టికంగఢ్ జిల్లాలోని ఓర్చా తాసిల్లో లద్పూరా ఖాస్ ఉన్నది. గ్రామీణ ఆచార, వ్యవహారాలతో పాటు చారిత్రాత్మక ఆనవాళ్లను కూడా ఈ గ్రామం పదిలపర్చుకున్నది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బుందేల్ఖండ్లో క్రీ. శ. 1501లో రుద్రప్రతాప్ సింగ్.. ఓర్చా తాసిల్, లద్పూరా ఖాస్ నిర్మించారు. బుందేల్ఖండ్ ప్రాంతంలోని కోటలు, పురాతన కట్టడాలు, చతుర్భుజ మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు.
పోటీ ఉద్దేశం ఏమిటి?
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్దతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా యూఎన్డబ్ల్యూటీవో ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీని నిర్వహిస్తున్నది. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన, సంప్రదాయాల పరిరక్షణ, అసమానతల తొలగింపు కూడా ఈ పోటీ మరో ఉద్దేశం.