హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలు.. సాగునీటి ప్రాజెక్టులు.. ప్రజాహిత నిర్మాణాలకు భూములిచ్చిన రైతులంటే మొన్నటిదాకా చులకన. వారిని ఆదుకోవడం మాట దేవుడెరుగు.. కనీసం న్యాయమైన పరిహారంకూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత భూములిచ్చిన రైతులను త్యాగధనులుగా కీర్తిస్తున్నది. పరిహారంతోపాటు.. ఆ కుటుంబం అన్నిరకాలుగా నిలదొక్కుకొనేలా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నది. తెలంగాణకు తలమానికంగా, దేశానికి గర్వకారణంగా నిలవనున్న ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపే బృహత్తర క్రతువు కూడా ఇదేకోవలో కొనసాగుతున్నది. న్యాయమైన పరిహారంతోపాటు భూములిచ్చిన ప్రతి కుటుంబంలోనూ ఒకరికి ఉద్యోగం కల్పించే దిశగా అడుగులు మొదలయ్యాయి. ఫార్మా కంపెనీల్లో పనిచేసే సాంకేతిక అర్హతలు లేనివారిని గుర్తించి.. వారికి సరైన శిక్షణ ఇచ్చే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా యాచారం, కందుకూరు మండలాల్లో దాదాపు ఐదు వేల మంది యువతను గుర్తించారు. వీరికి తుక్కుగూడలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తారు.
కుటుంబానికో ఉద్యోగం
ఫార్మాసిటీకి భూములిచ్చిన ప్రతి కుటుంబంలోనూ అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన మాట మేరకు భూములిచ్చిన కుటుంబాల్లోని యువత వివరాలను ఇప్పటికే టీఎస్ఐఐసీ అధికారులు సేకరించారు. కందుకూరు మండల పరిధిలో 1,400, యాచారం మండల పరిధిలో 3,600 మంది వరకు యువతను గుర్తించారు. సాధారణంగా ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించాలంటే అందుకు సంబంధించిన సాంకేతిక అర్హతలు ఉండాలి. కానీ, నిర్వాసిత కుటుంబాల్లో ఈ అర్హతలు ఉన్న వారు ఉంటే వారికి ఉద్యోగం ఇప్పిస్తారు. సాంకేతిక అర్హతలు లేని వారికి సైతం ఆ మేరకు శిక్షణ ఇచ్చి అర్హత సాధించేలా తయారుచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టడం విశేషం. ఈ మేరకు టీఎస్ఐఐసీ అధికారులు తొలి విడతలో భాగంగా యాచారం మండలం మేడిపల్లి, కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో వంద మంది చొప్పున యువతకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. తుక్కుగూడలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భవనంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. గత రెండు రోజులుగా సంబంధిత యువతకు ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. విడతలవారీగా అన్ని గ్రామాల పరిధిలో భూములిచ్చిన కుటుంబాల్లో గుర్తించిన వారికి శిక్షణ పూర్తి చేస్తారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా యాచారం మండలం మేడిపల్లిలో ఇప్పటికే భారీ స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా చేపడుతుంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ మేరకు ప్రతి గ్రామంలోనూ కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
అద్భుతమైన ప్యాకేజీ
రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోనే అతి పెద్ద ఫార్మాసిటీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. యాచారం మండలం మేడిపల్లి, నానక్నగర్, కుర్మిద, కందుకూరు మండలం ముచ్చర్ల, ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, సాయిరెడ్డిగూడ, మహ్మద్నగర్, కందుకూర్, సర్వరావులపల్లి తదితర గ్రామాల పరిధిలో 19,400 ఎకరాల భూముల్ని ఫార్మాసిటీకి సేకరిస్తున్నారు. ఇందులో 9400 ఎకరాల వరకు ప్రభుత్వ భూ మి ఉండగా.. మిగిలినవి పట్టా, అసైన్డ్ భూములు. ఫార్మాసిటీ కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూముచ్చారు. భూములిచ్చిన కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం అద్భుత ప్యాకేజీని ప్రకటించింది. పట్టా భూమికి ఎకరాకు రూ.16.50 లక్షల వరకు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ. 8.50 లక్షల వరకు నగదు పరిహారాన్నిచ్చింది. భూమిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చేందుకు కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1,400 ఎకరాలు సేకరించింది. ఇందులో 600 ఎకరాల్లో నివాస స్థలాల కోసం భారీ లేఅవుట్ను సిద్ధంచేసింది. భూమిని కోల్పోయినవారికి ప్రభుత్వం ఎకరాకు 121 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాటును ప్రకటించింది. అధునాతన వసతులతో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరుగాల్సి ఉన్నది.