న్యూఢిల్లీ/లండన్/బీజింగ్, డిసెంబర్ 13: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. తాజాగా బ్రిటన్లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సస్ వెల్లడించారు. డెల్టా వేరియంట్ కంటే దీని తీవ్రత మోస్తరుగా లేదా తక్కువగా ఉంటుందని సంబురపడొద్దని సూచించారు. దీనినుంచి తప్పించుకోవాలంటే బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన ఆంక్షలు తప్పవన్నారు.
75 వేల మరణాలు..
నియంత్రణ చర్యలు తీసుకోకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ వేరియంట్తో బ్రిటన్లో 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించవచ్చని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసన్ అధ్యయనం పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, ఎక్కువ కేసులు నమోదు కావడంతో పాటు దవాఖానల పాలయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒమిక్రాన్ను కట్టడి చేసేందుకు అవసరమైతే కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పాకిస్థాన్తో పాటు చైనాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.
వారికి ఎక్కువ రక్షణ
గతంలో కొవిడ్-19 సోకిన వారు, వ్యాక్సిన్ వేసుకున్న వారు ఒమిక్రాన్ నుంచి కాస్త ఎక్కువగానే రక్షణ ఉంటుందని చైనాలోని నేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధ్యయనంలో తేలింది. కరోనాకు చికిత్స తీసుకోవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.