హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద విద్యుత్తు వాహనాల యూని ట్ తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నది. విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి కంపెనీ మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో దీనిని ఏర్పాటు చేయనున్నది. దీనికి టీఎస్ఐఐసీ 150 ఎకరాల భూమిని కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.
దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈవీలకు మినహాయింపులు ఇవ్వడమే కాకుం డా ప్లాంట్లు స్థాపించేవారికి కూడా ప్రోత్సాహకాలను అందిస్తున్నది. పెద్దఎత్తున బ్యాటరీ స్టేషన్లు, చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్న ది. ఈ నేపథ్యంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్లాంట్ను అతితకువ మానవ ప్రమేయం, పూర్తిస్థాయి ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నారు. మొదట సంవత్సరానికి 2500 బస్సుల తయారీ సామర్థ్యంతో ఏర్పా టు చేస్తున్నారు. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 10,000 బస్సులకు విస్తరిస్తారు. ట్రకులు, త్రీవీలర్స్, ఎల్సీవీలు, ఎంసీవీలను కూడా తయారు చేయనున్నారు.
విద్యుత్తు వాహనాల విప్లవంలో భాగంగా వస్తున్న ఈ ప్లాంటు ఒలెక్ట్రా గ్రీన్టెక్ భవిష్యత్తును మలుపుతిప్పుతుందని సంస్థ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్ ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే అగ్రగామి విద్యుత్తు వాహనాల కంపెనీగా ఎదగాలన్న లక్ష్యంతో ఒలెక్ట్రా పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఈ యూనిట్ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పతుందని వివరించారు.
ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38% వృద్ధిని సాధించినట్టు సంస్థ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.69.05 కోట్లకు పెరిగిందని, గత ఏడాది ఇదే సమయానికి ఆదాయం రూ. 50.19 కోట్లుగా నమోదు అయిందని తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల డివిజన్ ఆదాయం రూ.17.8 కోట్ల నుంచి రూ. 42.1 కోట్లకు పెరిగిందని, ఇన్సులేటర్ల డివిజన్ ఆదాయం 17 శాతం తగ్గి రూ.32.4 కోట్ల నుంచి 27 కోట్లకు పడిపోయిందని వెల్లడించింది. స్థూల లాభం రూ.3.4 కోట్ల నుంచి రూ. 5.7 కోట్లకు, నికరలాభం రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3.71 కోట్ల పెరిగిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.
టీఎస్ఐఐసీ కేటాయించిన భూమి 150 ఎకరాలు
ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం 2500 బస్సులు
విస్తరించనున్న ఉత్పత్తి సామర్థ్యం 10,000 బస్సులు
మహారాష్ట్ర ఆర్టీసీ ఆర్డర్ 100 బస్సులు