హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): పట్టణాలు రాష్ర్టానికి, దేశానికి ఆర్థిక ఇం జిన్ల (ప్రధాన ఆదాయ వనరులు) వంటివని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. తెలంగాణలో పట్టణాల అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని చెప్పారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టణాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అసీ) ఆధ్వర్యంలో గురువారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో మంత్రి కేటీఆర్తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులు పాల్గొన్నారు. పురపాలకశాఖ పరిధిలోని వివిధ అంశాలపై సుమారు ఆరు గంటలపాటు విసృ్తతస్థాయిలో మేధోమథనం జరిపారు. పట్టణ ప్రణాళిక తయారీలో దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన పద్ధతులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తున్నదని, దీర్ఘకాలిక లక్ష్యాలతో వాటిని తీర్చిదిద్దుతున్నదని చెప్పారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక మౌలి క వసతుల కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపట్టిన విషయాన్ని వివరించారు. పట్టణాల్లో అభివృద్ధి మరింత ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు చేపట్టే ప్రక్రియ నిరంతరమైనదని, దీన్ని ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు, ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చుకొంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని చె ప్పారు. ఈ దిశగా రాష్ట్ర మున్సిపల్శాఖ కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇలాంటి విసృ్తతమైన మేధోమథన సమావేశాలను నిర్వహించడం ద్వారా అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో వివిధ అంశాలపై ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, వాటన్నింటికీ స్వయంగా హాజరవుతానని ఆయన పేర్కొన్నారు.
గతంలో కన్నా భిన్నంగా పట్టణాల అవసరాలు
గతంలోకన్నా భిన్నంగా పట్టణాల అవసరాలు ఉన్నాయని, పట్టణాల ప్రణాళిక రూపొందించే సమయంలో భవిష్య త్తు అవసరాలకు పెద్దపీట వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అనంతరం వివిధ అంశాలపై అధిపతులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమా ర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి అధి కారులు తదితరులు పాల్గొన్నారు.