అక్కడి ఓటర్లు మిమ్మల్ని బయటివ్యక్తి అనరు
తృణమూల్ సవాల్పై మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనపై 2024లో మమతా బెనర్జీ పోటీ చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ విసిరిన సవాల్పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. వారణాసి ప్రజలు దీదీలాంటి వారు కాదని, పెద్దమనసున్న వారని, ఆమెను బయటి వ్యక్తిగా పరిగణించరని మోదీ వ్యాఖ్యానించారు. వారణాసిలో నుదట తిలకం పెట్టుకుని, జై శ్రీరాం, హరహర మహాదేవ అని దైవనామ స్మరణ చేస్తూ చాలామంది కనిపిస్తారని, వారిని చూసి దీదీ ఎలా స్పందిస్తారో అని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా తదితర బీజేపీ నాయకులను బయటి వ్యక్తులుగా బెంగాల్ ఎన్నికల ప్రచార సభల్లో మమత విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దెబ్బతాకితే కాలు ఎలా ఊపుతారు: బీజేపీ
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకు గాయమైన కాలును ఊపుతున్నట్టు బయటకు వచ్చిన వీడియో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. టీఎంసీ కార్యకర్తలతో సమావేశంలో వీల్చైర్లో కూర్చొన్న మమత బ్యాండేజీ ఉన్న కాలును కదిలిస్తున్నట్టు ఉన్న వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి ప్రణయ్ రాయ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రజల సానుభూతి కోసం మమత ఆడుతున్న నాటకాన్ని కట్టిపెట్టాలన్నారు. బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. గాయంపై అనుమానాలు వ్యక్తం చేసి వైద్యులను అవమానించారని యశ్వంత్ సిన్హా అన్నారు. బీజేపీ నేతలు ఎల్లవేళలా మమత పాదాలనే చూస్తుండటం ఆమె కాళ్లపై పడటానికి తక్కువేమీ కాదని కునాల్ ఘోష్ అన్నారు.
ఓట్ల కోసం బీజేపీ మత కలహాలు: మమత
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నదని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో రైదిఘీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లింలు మజ్లిస్, ఐఎస్ఎఫ్ పార్టీల మాయలో పడవద్దన్నారు. మజ్లిస్కు బీజేపీ సాయం చేస్తున్నదన్నారు.
శారదా కేసులో తృణమూల్ నేతల ఆస్తులు జప్తు
శారదా కుంభకోణం కేసులో తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్, పార్టీ ఎంపీ శతాబ్ది రాయ్, శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ దేవయాని ముఖర్జీలకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
బీజేపీ నేత హిమంతపై నిషేధాన్ని కుదించిన ఈసీ
ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై రెండు రోజుల పాటు విధించిన నిషేధాన్ని ఒక రోజుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) కుదించింది.
బరినుంచి తప్పుకొన్న తొలి ట్రాన్స్జెండర్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తొలి ట్రాన్స్జెండర్ అభ్యర్థిగా నిలిచిన అనన్యకుమారి అలెక్స్.. పోరునుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తాను నామినేషన్ వేసిన డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ (డీఎస్జేపీ) నాయకులే.. మానసికంగా వేధించారని, మాట వినకపోతే చంపుతామని బెదిరించారని తెలిపారు. వేశ్య అంటూ అవమానించారన్నారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో.. ప్రచారాన్ని నిలిపేస్తున్నట్టు 28 ఏండ్ల అలెక్స్ ప్రకటించారు
అన్ని వ్యవస్థల్లోనూ సంఘ్ శక్తులే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: దేశంలోని అన్ని వ్యవస్థలనూ అధికార బీజేపీ మాతృసంస్థ సంఘ్పరివార్ మనుషులతో నింపేస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ అండర్ సెక్రెటరీ నికోలస్ బర్స్న్తో శుక్రవారం రాహుల్గాంధీ ముఖాముఖిలో మాట్లాడారు. ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా అధికారపార్టీ పూర్తిగా మార్చివేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో పోరాడాలంటే వ్యవస్థీకృత నిర్మాణం, స్వేచ్ఛాయుత మీడియా ఉండాలని కాంగ్రెస్ నమ్ముతుందని, ఇప్పుడు భారత్లో అలాంటి వాతావరణమే లేదని పేర్కొన్నారు. డబ్బు వెదజల్లి మీడియా సహా అన్నివ్యవస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకొన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రమే కాదు.. ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలువలేదని పేర్కొన్నారు. భారత్లో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులపై అమెరికా ఎందుకు మౌనం వహిస్తున్నదని రాహుల్గాంధీ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా తొలిగింపు
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక