లారీకి లోడ్ ఎత్తాలన్నా, దించాలన్నా హమాలీలు ఉండాల్సిందే. వాళ్లే లేకుంటే రాష్ట్రంలో వ్యాపారం సాగటం దాదాపు కష్టం. రాష్ట్రంలోని హమాలీల్లో బీహార్, మహారాష్ట్రకు చెందినవాళ్లే అధికం. అన్ని రాష్ర్టాల మాదిరి మన రాష్ట్రంలోనూ ఆగమేఘాల మీద లాక్డౌన్ పెట్టి ఉంటే అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యేవి. ముఖ్యంగా వ్యవసాయ రంగం దెబ్బతినేది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సరైన సమయంలో తీసుకొన్న నిర్ణయంతో అన్నదాతకు పెను ముప్పు తప్పింది. పంట దిగుబడి కల్లాల్లోనే ఉండాల్సిన దుస్థితి దూరమైంది.
కరీంనగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమయం చూసుకుని తీసుకున్న ఓ నిర్ణయం.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా కాపాడింది. సమస్యలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఆ నిర్ణయం.. పొరుగు రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వేలమంది హమాలీలకు తెలంగాణలో ఉపాధిపై భరోసానిచ్చింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఏ మాత్రం గందరగోళం నెలకొన్నా.. గత లాక్డౌన్ అనుభవాల నేపథ్యంలో హమాలీలు తమ సొంతూళ్లకు పయనమయ్యేవారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు సరఫరా, లోడింగ్, అన్లోడింగ్లో కీలకమైన హమాలీలు లేకపోతే.. రైతుల తమ ధాన్యాన్ని కల్లాల్లోనే కాపాడుకోవాల్సి వచ్చేది. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి, అటు రైతుకు, ఇటు హమాలీకి ఇబ్బందులు లేకుండా చూశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే జోరుగా కొనుగోళ్లు సాగుతున్నాయని అంటున్నారు.
మన రాష్ట్రంలో రైస్మిల్లుల్లో పనిచేస్తున్న హమాలీల్లో 90% బీహార్ వాళ్లు, 5% మహారాష్ట్రకు చెందిన వారు కాగా.. మిగిలిన 5% మాత్రమే మనవాళ్లు ఉంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని 800 పైచిలుకు పారా బాయిల్డ్ రైస్మిల్లుల్లో 24వేల మందికిపైగా హమాలీలు ఇతర రాష్ర్టాలకు చెందినవారే పనిచేస్తున్నారు. లాక్డౌన్ వల్ల వీరంతా అప్పట్లో తమ సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయారు. దీని వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద కొన్న ధాన్యాన్ని రైస్మిల్లుల్లో దించే వారు లేక చాలా అవస్థలు ఎదురయ్యాయి. ధాన్యం తీసుకెళ్లిన ఒక్కో వాహనం ఖాళీ కావాలంటే మూడు నాలుగురోజులు పట్టింది. దీంతో కొనుగోలు కేంద్రం వద్ద భారీగా ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి. ఫలితంగా కొనుగోలుచేసే ధాన్యం ఎక్కడ పెట్టాలో తెలియక.. చాలా చోట్ల కొనుగోళ్లు కూడా నిలిపివేసిన సందర్భాలు చూశాం.
ముఖ్యమంత్రి ముందుచూపు నిర్ణయం
గతేడాది ఎదురైనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించారన్న అభిప్రాయాలు మెజార్టీ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. లాక్డౌన్ పెడుతారంటూ ప్రచారం జరిగిన ప్రతిసారి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేస్తూ వచ్చారు. లాక్డౌన్ పెట్టకపోవడానికి గల కారణాలను కూడా వివరించారు. అయితే, తప్పని పరిస్థితుల్లో మంగళవారం క్యాబినెట్ పదిరోజులపాటు లాక్డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకొన్నా.. ఇన్నాళ్లుగా లాక్డౌన్ పెట్టకపోవడం వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేనంత ఈ యాసంగిలో 1.32 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనావేశారు.
అందులో స్థానిక అవసరాలకు పోను 80 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొంటున్నది. గత యాసంగిలో 64.17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేసి రికార్డు సృష్టించి ప్రభుత్వం, ఈసారి తన రికార్డునే తానే బ్రేక్చేయనున్నది. అంతేకాదు, ప్రతిగింజనూ కొంటామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. నిజానికి గతంలో మాదిరిగానే మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాక్డౌన్ పెట్టి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలేది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టబోమంటూ పదేపదే చెప్పటం వల్ల హమాలీలు ఇక్కడే ఆగిపోయారు. దీంతో అన్నదాతలకు కొనుగోళ్ల విషయంలో ముప్పు తప్పింది. అలాగే రైస్ మిల్లులపై భారీ భారం తప్పడమే కాదు, కొనుగోళ్లు సజావుగా సాగడానికి అవకాశం ఏర్పడింది.
హమాలీలను ఆదుకొన్నారు
లాక్డౌన్ విషయంలో ఈసారి సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బయటినుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అన్ని వర్గాలను కాపాడుకొనేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఇన్నాళ్లు లాక్డౌన్ పెట్టకపోవటం అన్నదాతలకు అతి పెద్ద సహాయం చేసినట్టయింది. మిగిలిన రాష్ర్టాల మాదిరిగా గత నెలలో లాక్డౌన్ పెట్టి ఉంటే మా వద్ద పనిచేసే వేలమంది బీహార్ హమాలీలు సొంత ఊర్లకు వెళ్లిపోయేవారు. మిల్లుల్లో ధాన్యం దించుకోవడానికి ఇబ్బంది ఎదురయ్యేది. ఇప్పుడు లాక్డౌన్ పెట్టినా పని ఉన్నది కాబట్టి హమాలీలు ఎక్కడి వెళ్లరు. పనులు సజావుగా సాగుతాయి.
భారీ నష్టం వాటిల్లేది
నిజానికి ఏప్రిల్లో లాక్డౌన్ పెట్టి ఉంటే మిల్లులకు, రైతులకు భారీ నష్టం వాటిల్లేది. హమాలీలు లేకపోతే.. ఏ మిల్లరూ ఏమి చేయలేని పరిస్థితి ఉండేది. మన వద్ద ఉన్న హమాలీలు సరిపోరు. ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కొనుగోళ్లకు సంబంధించి లాక్డౌన్ నిబంధనలు మాకూ సడలిస్తే రైతులకు, మా మిల్లులకు మేలు చేకూరుతుంది.