టోక్యో, ఏప్రిల్ 13ః జపాన్లో దశాబ్దంక్రితం సంభవించిన భారీ భూకంపం, సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలోని శుద్ధిచేసిన అణుధార్మిక జలాలను పసిఫిక్ మహాసముద్రంలోకి విడుదలచేయాలని ఆ దేశం నిర్ణయించింది. ప్రధాని యొషిహిడే సుగా నేతృత్వంలో మంగళవారం సమావేశమైన క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రక్రియకు కొన్ని సంవత్సరాలు పడుతుందని ప్లాంటు నిర్వహణ సంస్థ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అంచనా వేసింది. అయితే, ఫుకుషిమా నీటిని సముద్రంలోకి విడుదలచేయాలన్న నిర్ణయాన్ని స్థానిక జాలర్లతోపాటు పర్యావరణవేత్తలు, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయని, తమ సముద్ర ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోతుందని జాలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
2011లో సంభవించిన భారీ భూకంపం వల్ల ఫుకుషిమా దైచీ అణువిద్యుత్ కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. చల్లబర్చే కూలెంట్ నీరు లీకై బయటికి రావటంతో ఆ ప్రాంతమంతా రేడియో ధార్మికత వ్యాపించింది. సునామీకి ఎగిసిపడిన సముద్రపు నీరు కూడా భారీమొత్తంలో ప్లాంటులోకి చేరి, అక్కడే ఉండిపోయింది. ఈ నీటిలో పెద్దమొత్తంలో చేరిన రేడియోధార్మిక పదార్థాలను టెప్కో అప్పటినుంచి వేరుచేస్తూ వస్తున్నది. ఇలా వేరుచేయగా మిగిలిన నీటిని శుద్ధిచేసిన జలంగా పిలుస్తారు. దాదాపు 1000 భారీ ట్యాంకుల్లో 13.7 లక్షల టన్నుల శుద్ధిచేసిన జలాలను ఇప్పటివరకూ నిల్వచేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి నిల్వ సామర్థ్యం పూర్తిగా అయిపోతున్నది. దీంతో ఈ జలాలను సముద్రంలోకి విడుదలచేయక తప్పదని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్లాంటులోని జలాలను అంతర్జాతీయ అణుశక్తి సంఘం నిర్దేశించిన స్థాయికి జపాన్ శుద్ధిచేసినట్టు చెబుతున్నది. అయితే, నీటిలో అణుధార్మికత కలిగిన ట్రిటియం అనే ఐసోటోపులు మాత్రం శుద్ధిచేయటం సాధ్యంకాదని తేల్చింది. ఇప్పుడు విడుదలచేసే జలాల ద్వారా తక్కువ మోతాదులో ట్రిటియం సముద్రంలో కలువనున్నది. ఇది మనిషి శరీరంలోకి చేరితే 20 ఏండ్లవరకు ప్రభావం చూపొచ్చు. దీంతో శుద్ధిచేసిన జలాన్ని సముద్రంలో విడుదల చేయకూడదని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
శుద్ధిచేసిన జలంలో మిగిలిపోయిన ట్రిటియం, కార్బన్-14 వంటి అణుధార్మిక పదార్థం ఆహార గొలుసును సులభంగా కలుషితం చేస్తుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమ సంస్థ గ్రీన్పీస్ తెలిపింది. దీర్ఘకాలంలో రేడియో ధార్మిక పదార్థాలు డీఎన్ఏను ధ్వంసం చేస్తాయని, కలుషిత నీటిని పూర్తిగా శుద్ధిచేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చేవరకు ఆ నీటిని నిల్వచేయాలని సూచించింది. నీటి విడుదలతో ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రజల్లో నమ్మకం కుదరటంలేదని ఫుకుషిమా జాలర్ల సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు, ఇలాంటి నీటిని ఎక్కడైనా సముద్రంలోకే వదులుతారని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాసీ తెలిపారు.