బూడిద సుధాకర్ : హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లో దేవుడి మాన్యాన్ని 66 ఎకరాలు అక్రమంగా పొందడమే కాకుండా.. ఆ తర్వాత దాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఈటల రాజేందర్ అనేక ఏండ్లుగా నానాపాట్లు పడ్డారు. సీఎంల చుట్టూ తిరిగారు. అసెంబ్లీలో తన పేరు చెప్పకుండా, ఆ భూములను కొన్న రైతులంతా కష్టపడుతున్నారని, వారికి న్యాయం చేయాలని మొసలికన్నీరు కార్చారు. ఇందుకోసం ఇప్పుడు ఆయన చూపిస్తున్నది 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నియమించిన దివాన్ కమిటీ ఇచ్చిన నివేదిక. దేవరయాంజాల్ భూములు దేవుడివే అనేందుకు ఆధారాలు లేవంటూ దివాన్ కమిటీ నివేదికకు వక్రభాష్యం చెప్తున్నారు. రెండు రోజుల క్రితం తన ఫాంహౌస్లో మీడియాతో మాట్లాడిన ఈటల.. ‘దేవరయాంజాల్ భూములపై దివాన్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. మీకు ఇస్తా. అక్కడ నాకు ఉన్నది ఆరున్నర ఎకరాలే. ఈ దివాన్ కమిటీ ఏం చెప్పిందో చెప్తా. ‘ఇవి ప్రభుత్వ భూములనికానీ, దేవాలయ భూములనికానీ ఆధారాలు లేవు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని చెప్పింది. నాకోసం కాకపోయినా రైతుల కోసం దీనిని పరిష్కరించాలని నాటి సీఎం వైఎస్ దగ్గరకు స్వయం గా పోయిన. అసెంబ్లీలో మాట్లాడిన. తర్వాత రోశయ్య, కిరణ్కుమార్రెడ్డికి కూడా చెప్పిన. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ వద్దకెళ్లి అడిగిన’ అన్నారు. ఇప్పుడు ఈటల చేతిలో దివాన్ కమిటీ ఉన్నది. మీడియాకు దాన్నే చూపిస్తున్నారు. తన తప్పేమీలేదని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈటల చెప్తున్న ఈ దివాన్ కమిటీ ఏమిటి? దేవరయాంజాల్ భూములపై ఇచ్చిన నివేదిక ఏమిటి? ఆలయ భూముల క్రయ విక్రయాలపై హైకోర్టు ఉత్తర్వులు ఏమి ఉన్నాయి అన్న అంశాలపై స్పష్టతకోసం ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
దేవర భూముల కబ్జాపై ప్రత్యేక కమిటీ
మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల పరిధిలోని దేవరయాంజాల్లోని దేవాలయ భూములు తమవేనని 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆ భూముల్లో కబ్జాలో ఉన్న రైతు సమాఖ్య ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు. ఈ భూములను తాము సాగుచేసుకొంటున్నాం కాబట్టి తమకు కేటాయించాలని, అవి దేవాలయ భూములు కావని, సొంతభూములని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన వైఎస్ ప్రభుత్వం 23.6.2005న జీవో ఆర్టీ-1230 (రెవెన్యూ-ఎండోమెంట్-2)ను, తేదీ 21.10.2005న జీవో ఆర్టీ-2032 (రెవెన్యూ-ఎండోమెంట్-2)ను జారీచేసింది. దేవరయాంజాల్లోని దేవాలయ భూములపై విచారణ చేయాలని సూచిస్తూ.. విచారణ అధికారిగా అప్పటి సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) అయిన టీకే దివాన్ను వైఎస్ నియమించారు. ఈ భూములపై సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ఆదేశించారు. దేవరయాంజాల్లోని భూమి వాస్తవంగా ఎవరిది? రైతు సమాఖ్య ప్రతినిధులకు, ఈ భూమికి ఏమన్నా సంబంధం ఉన్నదా? అనే అంశాలను నిగ్గుతేల్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రంగంలోకి టీకే దివాన్..
ఈ క్రమంలోనే టీకే దివాన్ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రైతు సమాఖ్య ప్రతినిధులతో 19.5.2006న సమావేశం నిర్వహించారు. తర్వాత క్షేత్రస్థాయిలో భూములను, రెవెన్యూ, ఎండోమెంట్ రికార్డులను పరిశీలించారు. సర్వే నంబర్, విస్తీర్ణం, 1925-26 పహాణీల ప్రకారం, 1944 సేత్వార్, 1954-55 ఖాస్రా పహాణీలో ఏమున్నది? 1999 తర్వాతి పహాణీల్లో ఏమున్నది? అన్న అంశాల ప్రాతిపదికన భూముల వివరాలు నమోదుచేశారు.
70 ఏండ్ల నుంచే కబ్జాల పర్వం
1954-55 సంవత్సరం నుంచే దేవరయాంజాల్ భూములపై ప్రైవేట్ వ్యక్తుల కన్నుపడిందనడానికి దివాన్ నివేదిక ప్రబలమైన తార్కాణం. 1944 సేత్వార్ ప్రకారం దేవరయాంజాల్ భూములన్నీ సీతారామస్వామి ఆలయం పేరుపైనే ఉన్నాయి. 1954-55 ఖాస్రా పహాణీ దగ్గరకు వచ్చేసరికి సీతారామస్వామి దేవస్థానం ఎంట్రీ పైన ప్రైవేట్ వ్యక్తుల పేర్లు రాశారు. ఆ తర్వాత సీతారామస్వామి పేరు మాయమై ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వచ్చాయి. వీటి ప్రకారం ఈ భూములు దేవుడి భూములేనని దివాన్ కమిటీ చెప్పకనే చెప్పింది. కానీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం అవి ఆలయ భూములు అని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని దివాన్ కమిటీ చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.
దివాన్ నివేదిక ఏం చెప్తున్నది?
వాస్తవానికి రైతుల పేరుతో వచ్చినవారికి మేలుచేయాలనే సంకల్పంతో ఉన్న దివాన్.. తన నివేదికలో ఇలా పేర్కొన్నారు. ‘some kind of solution on lines of regularization is only option’. అంటే ‘ఈ సమస్యకు ఏదో ఒక పద్ధతిలో భూముల క్రమబద్ధీకరణ ఒక్కటే పరిష్కారం’ అని తెలిపారు. ఈ విధంగా చేస్తే రైతులకు, దేవాదాయశాఖకు కూడా మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. దీని వల్ల రైతులకు పట్టాలు అందించడమే కాకుండా దేవాదాయశాఖకు పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ కూడా సమకూరుతుందన్నారు. కానీ, అంతకుముందే దేవాదాయభూముల క్రమబద్ధీకరణను హైకోర్టు నిషేధించింది. దీంతో.. ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టాలో ఉపాయాన్ని కూడా దివాన్ కమిటీ నాటి సర్కార్కు తెలిపింది.
హైకోర్టు ఆదేశాలమేరకు దేవుడి మాన్యాన్ని క్రమబద్ధీకరించడం కుదరదు కాబట్టి, దేవాలయం పేరిట టైటిల్ ఇచ్చేయాలని, ఆ తర్వాత హైకోర్టు అనుమతితో ఆలయ భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితానుంచి తొలగించిన తర్వాతే రైతులకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను రాసివ్వగలమని స్పష్టంచేశారు. ఇందుకోసం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కూడా తెలిపారు. క్రమబద్ధీకరణ, కాంప్రమైజ్ వంటి రెండు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలించవచ్చని సూచించారు. కానీ అంతకుముందే 14.10.2004న జీవో ఎంఎస్ నంబర్-810 (రెవెన్యూ-ఎండోమెంట్-2)ను అప్పటి ప్రభుత్వం జారీచేసింది. దీని ప్రకారం ‘ప్రొహిబిటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్స్ డాక్యుమెంట్’ అని పేర్కొంటూ రాష్ట్రంలోని దేవాలయ భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, సేల్డీడ్లు కానీ చేయవద్దని స్పష్టంగా పేర్కొన్నది. దివాన్ కమిటీ ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోలేదు. కొందరు కబ్జాదారులకు మేలుచేసేందుకు ప్రభుత్వానికి ఉచిత సలహాలిచ్చింది. అంతేతప్ప దేవుడి భూముల ఆక్రమణదారులకు నిబంధనల ప్రకారం పట్టాలు ఇవ్వాలని పేర్కొనలేదు.
అసలు ట్విస్ట్ ఏంటంటే..
హైకోర్టు W.P. నెంబర్ 11812/2005, IN W.P. M.P (మిస్లీనియస్ పిటిషన్)-15055 హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఉమ్మడి ఏపీలోని దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరణ కానీ, అమ్మకం కానీ, కాంప్రమైజ్ కానీ చేసే అధికారం ఎండోమెంట్ యాక్టు 30/1987 లోని సెక్షన్ 89 ప్రకారం లేదని 2005లో హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. అలా దేవుని భూములను ఆక్రమించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయాలను దివాన్ కమిటీ ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దేవుడి భూములను ఏకపక్షంగా రైతులకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయాలనుకొంటే.. ఎట్లా చెయ్యాలో సూచించడం వెనుక మతలబు అనుమానాస్పదమే.
హైకోర్టు తలుపులూ తట్టిన జమున
దివాన్ కమిటీ రిపోర్టు ఆధారంగా.. అప్పట్లో ఈటల రాజేందర్ పలువురు ముఖ్యమంత్రులను కలిసి విన్నవించుకొన్న తర్వాత కూడా భూములు క్రమబద్ధీకరణ కాకపోవడంతో 2011లో ఈటల జమున.. ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. సీతారామస్వామి ఆలయ భూములుగా పేర్కొంటున్న సర్వే నెంబర్ 55, 56, 57, 58, 730, 731, 722లలోని భూములను తమ పేరిట చేయాలని, ఈ భూములను క్లియర్చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని, తమకు భూ పత్రాలను జారీచేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈటల జమునతో పాటు మరో పదిమంది హైకోర్టులో (W.P. NO.22022/2011) ఈ పిటిషన్ వేశారు. ఈటల రాజేందర్ చెప్తున్నట్టు దేవరయాంజాల్లో ఆయనకు ఆరున్నర ఎకరాలే ఉన్నట్టయితే.. జమున తన పిటిషన్లో పేర్కొన్న మొత్తం ఏడు సర్వే నంబర్లలో ఉన్నది కూడా ఆరున్నర ఎకరాలేనా? అనేది సందేహం.