దుబాయి, జూలై 22: అమృతం కోసం దేవతలు క్షీరసాగర మథనం చేశారు. వర్షం కోసం యూఏఈ ప్రభుత్వం మేఘ మథనం చేస్తున్నది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం మేఘాలను కరిగిస్తున్నది. తాగు నీటి కోసం సొంతంగా వానను కురిపించుకొంటున్నది. మేఘమథనం అంటే ఏదో తుంపర్ల లాంటి వాన కాదు. మన దగ్గర నైరుతి రుతుపవనాలు వచ్చినప్పుడు ఎట్లాంటి వాన పడుతుందో అక్కడా అలాగే పడుతున్నది. ఎడారి ఇసుకలో సైతం వరద పారుతున్నది. రోడ్డు పక్క నుంచి జాలువారే నీళ్లు జలపాతాన్ని తలపిస్తున్నాయి. మేఘమథనం కాన్సెప్ట్ పాతదే అయినా యూఏఈ కొత్త తరహా టెక్నాలజీతో వానదేవుడిని వశం చేసుకొంటున్నది. డ్రోన్ల సాయంతో మేఘాల్లోకి కరెంటును పంపి మరో మేఘం దగ్గరికి కదిలిస్తున్నది. రెండు మేఘాలు దగ్గరికి చేరగానే క్లౌడ్ సీడింగ్ సాంకేతికతతో మేఘాన్ని చినుకులుగా మారుస్తున్నది. ఇలా కురిసిన వాన నీటిని ఎప్పటికప్పుడు ఒడిసిపట్టడానికి దుబాయ్ మార్గాలను అన్వేషిస్తున్నది. డ్యాములు, ఎడారి లోయలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నది. దేశంలో ప్రస్తుతం 130 డ్యాములు ఉన్నాయి. వీటిల్లో 42 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. మరిన్ని డ్యాములు నిర్మించాలని యూఏఈ ప్రభుత్వం యోచిస్తున్నది.
రీడింగ్ వర్సిటీ సాంకేతికతతో..
వర్షం కోసం యూఏఈ వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని యూకేలోని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలో… డ్రోన్ల సాయంతో మేఘాల్లో విద్యుత్తు ప్రసరింపజేసి వాటిని కదిలేలా చేస్తారు. ఒక మేఘం మరో మేఘం దగ్గరగా కదిలినప్పుడు మేఘంలో అవపాతం సాంద్రత పెరుగుతుంది. అదే సమయంలో క్లౌడ్ సీడింగ్ సాంకేతికత ప్రకారం.. విమానాల ద్వారా లేదా భూమి నుంచే మేఘాల మీదకు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్, పొడి మంచును ప్రసరింపజేయడంతో అవపాతం పెద్ద నీటి బిందువులుగా మారి వర్షం పడుతుంది.
డీసాలినేషన్ ప్లాంట్ల కంటే ఖర్చు తక్కువే..
దుబాయ్లో ఏడాది సగటు వర్షపాతం 7.8 సెంటీ మీటర్లు. విదేశాల నుంచి వచ్చే కార్మికులు, పెరుగుతున్న జనాభాతో ఇటీవల నీటి అవసరాలు బాగా పెరిగాయి. తాగునీటి కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసుకోవాల్సిందే. దీనికోసం డీసాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. యూఏఈలో 42% జనాభా తాగునీటి అవసరాలు తీర్చేది ఈ ప్లాంట్లే. అయితే సముద్రపు నీటిని శుద్ధి చేసి రోజువారీ అవసరాలకు వినియోగించడం చాలా ఖర్చుతో కూడుకొన్నది. డీసాలినేషన్ ప్లాంట్ కంటే మేఘమథనం ద్వారా తాగు నీటిని సేకరించడం చాలా చవక.
అనువైన మేఘాలుంటేనే..
1902లో చార్లీ హాట్ ఫీల్డ్ 23 రకాల రసాయనాలను ట్యాంకర్లో మిక్స్ చేసి తర్వాత ఆ ద్రావణాన్ని ఆవిరిగా మార్చి గాల్లోకి పంపి కృత్రిమ వర్షం కురిపించాడు. కృత్రిమ వర్షానికి ఆది అదే. అయితే ఆ ఫార్ములా చెప్పకుండానే ఆయన కన్నుమూశారు. 1946లో అమెరికాకు చెందిన విన్సెంట్ జోసెఫ్ బెర్క్షైర్ పర్వతాల్లో డ్రై ఐస్తో వర్షం కురిపించారు. అప్పటి నుంచి క్లౌడ్ సీడింగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే విన్సెంట్ జోసెఫ్ను ఫాదర్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్ అంటారు. అయితే మేఘమథనం చేయాలంటే ఆకాశంలో వాన కురవడానికి అనువైన మేఘాలు ఉండాలి. నిర్మలాకాశంలో వర్షాన్ని కురిపించలేం. ఉన్న మేఘాలు మరో చోటికి తరలకుండా ఆపి వర్షం కురిపించడమే మేఘమథనం ప్రధాన ఉద్దేశం.
గతంలోనూ..
2008 బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా స్టేడియంలో వాన పడకుండా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించారు. మేఘాలు స్టేడియం దగ్గరకు రాకుండా వేరే చోట వాన కురిపించారు. చెర్నోబిల్ ఘటన తర్వాత రేడియో ధార్మికత గాలిలో వ్యాపించకుండా ఉండేందుకు సోవియట్ రష్యా కూడా కృత్రిమ వర్షాన్ని కురిపించింది. ఉమ్మడి ఏపీలో 2004 సమయంలో మేఘమథనం ప్రాజెక్టును చేపట్టారు. మేఘమథనంలో ప్రకృతి విపత్తులను కూడా నిరోధించే అవకాశం ఉంది. వర్షకాలాల్లో మేఘాలు ఒకే చోట చేరకముందు ఎక్కడికక్కడ వానలు కొట్టించడం ద్వారా వరదలను నివారించవచ్చు.