హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కబ్జాదారుల కుట్రలు భగ్నమయ్యాయి. అక్రమార్కుల ఆగడాలకు తెరపడింది. కాప్రాలోని ప్రభుత్వ భూముల విషయంలో చివరికి ధర్మమే గెలిచింది. కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి రూ. 1000 కోట్ల విలువైన భూమిని కాపాడేందుకు రెవెన్యూ అధికారులు పడిన శ్రమ ఫలించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రా పరిధిలో 69.21 ఎకరాల కస్టోడియన్ (ఎవాక్యూ) భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బలగాల సహకారంతో తాసిల్దార్ గౌతమ్కుమార్ ఆధ్వర్యంలోని రెవెన్యూ సిబ్బంది కబ్జాదారులు వేసిన అక్రమ ఫెన్సింగ్లను తొలగించి ‘ఇది ప్రభుత్వ భూమి’ అని గురువారం బోర్డులు పాతారు. కాప్రా గ్రామ పరిధిలోని 9, 11, 47, 140-143, 151-153, 676, 677లోని సర్వే నంబర్లలో 90.08 ఎకరాల భూమి ఉంది.
ఈ స్థలం మందాల బుచ్చం పేరిట ఉండగా, ఆయన 1942లో మరణించారు. అనంతరం పోలీస్యాక్షన్లో ఈ భూములను కోర్టు వేలం వేసింది. ఆ భూములపై హక్కులు పొందిన రహీం బక్స్ పాకిస్థాన్ వెళ్లిపోయారు. దీంతో జిల్లా కలెక్టర్ కస్టోడియన్గా వీటిని ఎవాక్యూ భూములుగా గుర్తిస్తూ 1952లో నోటిఫై చేశారు. ఆ తర్వాత 1954-55 కాస్రా పహాణీలో ఈ భూమిని ‘సర్కారీ కస్టోడియన్’ జాబితాలో చేర్చారు. ఈ ఎవాక్యూ భూములను 1966-68 మధ్య ముగ్గురికి.. గోకుల్దాస్ పేరిట 56.04 ఎకరాలు, ఈశ్వరీబాయి పేరిట 20.27 ఎకరాలు, మథురదాస్ పేరిట మిగిలిన 13.17 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఈశ్వరీబాయి, మథురాదాస్ పేర్లు పహానీలో ఉండగా, గోకుల్దాస్ పేరు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఆ తరువాత వివిధ కారణాల రీత్యా ఈ భూములపై హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి. చివరికి 2011లో సుప్రీంకోర్టు సదరు 90.08 ఎకరాల భూమి ఎవాక్యూ భూమేనని తేల్చి చెప్పింది. 2017లో అధికారులు 20.27 ఎకరాల భూమిని బాలకృష్ణ పేరిట మ్యుటేషన్ చేశారు. ఇది పోను మిగిలిన 69.21 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది.
తప్పుడు పత్రాలతో కబ్జా కుట్రలు
ఈ భూములపై కన్నేసిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో ఫ్యామిలీ పార్టీషన్ సూట్ వేశారు. ముఖ్యంగా ఇది ప్రభుత్వ భూమి అన్న విషయాన్ని దాచిపెట్టారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. వాస్తవాలన్నీ న్యాయస్థానం ముందుంచారు. వాస్తవాలన్నీ గుర్తించిన హైకోర్టు పిటిషనర్లు మండల నందం, జీపీఏ హోల్డర్ జే నాగరాజుగౌడ్, శరత్ చంద్రారెడ్డి తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించారని, వాస్తవాలను దాచిపెట్టారని ఈ ఏడాది జూన్లో ఇచ్చిన తీర్పులో ఆక్షేపించింది.
ఫెన్సింగ్ తొలగింపు…
న్యాయస్థానాల్లో కబ్జాదారుల కుట్రలు బట్టబయలై, ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో 69.21 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. గురువారం కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య తాసిల్దార్ గౌతమ్కుమార్, రెవెన్యూ సిబ్బంది 13.17 ఎకరాల్లో ఉన్న అక్రమ ఫెన్సింగ్ను జేసీబీలతో తొలగించారు.
తప్పుడు ఆరోపణలపై పరువు నష్టం దావా
కాప్రా కస్టోడియన్ భూముల వ్యవహారంలో నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధమే. ప్రభుత్వ భూముల రక్షణకు అధికారులకు అండగా నిలిచాం. తప్పుడు ఆరోపణలు చేసే వారికి మద్దతు తెలిపిన విపక్ష పార్టీల నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. బీజేపీ నాయకులు ఇప్పటికైనా బురదజల్లే పనులు మానుకోవాలి. కాప్రా కస్టోడియన్ భూములను రెవన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం హర్షణీయం.