హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. 30 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.
సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటన సారాంశం..
తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలుపంచు కుంటున్నారు. వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయి. ఉద్యోగులతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధంరీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులందరి హక్కులను గౌరవిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇంక్రిమెంటును ప్రకటించింది. 2014లో పదవ వేతన సవరణ చేస్తూ 43శాతం అత్యధిక ఫిట్ మెంటును ప్రకటించింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరి పట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్నది.
కరోనా విపత్తు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు వల్ల 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైంది. ఆర్థిక వ్యవస్థ ఇపుడిపుడే తేరుకుంటున్న నేటి సందర్భంలో రాష్ట్రంలోని అందరు ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేస్తున్నాం.
వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతిని గత ప్రభుత్వాలు అవలంభించాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.