Trisha | దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ జారా (Zara) పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దుస్తులు నాణ్యతలేకుండా రావడంతో పాటు వాటి నుంచి దుర్వాసన వస్తోందని ఆరోపిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, జారా నుంచి వరుసగా మూడు సార్లు వచ్చిన దుస్తుల నుంచి చెమట వాసన వస్తోందని పేర్కొన్నారు. డెలివరీకి ముందు ఉత్పత్తులను కనీసం సరిచూసి ప్యాక్ చేయాలని, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదని ఆమె వ్యాఖ్యానించారు.
ఒక ప్రముఖ సెలబ్రిటీ ఇలాంటి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. త్రిష పోస్టుకు స్పందించిన పలువురు నెటిజన్లు కూడా తమకు జారాతో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ బ్రాండ్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై జారా సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇదే సమయంలో త్రిష షేర్ చేసిన మరో ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. పెరిమెనోపాజ్ దశలో ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా, తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవించే ధోరణి పెరుగుతుందని ఒక వైద్యుడు చెప్పిన వ్యాఖ్యను ఆమె షేర్ చేస్తూ, దానికి “Fact” అని క్యాప్షన్ జత చేశారు. దీంతో ఆమె ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల త్రిష వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష చేసిన ప్రత్యేక పోస్ట్, అలాగే ఇద్దరూ కొన్ని కార్యక్రమాల్లో కలిసి కనిపించడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు త్రిష లేదా విజయ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇక సినిమాల విషయానికి వస్తే, త్రిష వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం ‘కరుప్పు’ ప్రేక్షకాదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.