Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ విడాకుల వ్యవహారం ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా 2014లో వీరిద్దరూ అధికారికంగా విడిపోయిన తర్వాత, సుసానే ఖాన్కు హృతిక్ రూ.400 కోట్ల భారీ భరణం చెల్లించాడనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ తాజాగా సుసానే సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫరా ఖాన్ అలీ, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న రూ.400 కోట్ల భరణం వార్తలను పూర్తిగా ఖండించారు. హృతిక్ నుంచి సుసానే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
ఆన్లైన్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు తమ కుటుంబాన్ని బాధిస్తున్నాయని ఫరా అన్నారు. విడాకుల తర్వాత హృతిక్ ఇచ్చిన డబ్బుతో సుసానే రాత్రికి రాత్రే ధనవంతురాలైందని చెబుతున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. అలాంటి వార్తలు పూర్తిగా కల్పితం అని ఆమె పేర్కొన్నారు. సుసానే వ్యక్తిత్వంపై వస్తున్న విమర్శలను కూడా ఫరా ఖాన్ అలీ తీవ్రంగా తప్పుబట్టారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని డబ్బు కోసం జీవించేలా పెంచలేదు. విలువలు, ఆత్మగౌరవంతో జీవించడం నేర్పించారు. సుసానే ఎప్పుడూ తన స్వాభిమానంతోనే జీవించింది. ఆమె ఎవరి దగ్గరా డబ్బు ఆశించదు. ఆమెను గోల్డ్ డిగ్గర్గా చిత్రీకరించడం చాలా బాధాకరం. మేము గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాం. మా కుటుంబ విలువలు మాకు చాలా ముఖ్యమైనవి అని ఆమె తెలిపారు.
ఈ ప్రచారాలపై స్పందించాలని తాను పలుమార్లు సుసానేకు చెప్పానని ఫరా వెల్లడించారు. అయితే, అలాంటి పుకార్లను ఖండించడం వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పు రాదని సుసానే భావిస్తుందని చెప్పారు. ప్రజలు ఏమనుకున్నా తన జీవితంపై ప్రభావం ఉండదని ఆమె నమ్ముతుంది. అందుకే ఈ ప్రచారాల గురించి పెద్దగా పట్టించుకోదు అని ఫరా పేర్కొన్నారు.విడాకులు తీసుకున్నప్పటికీ హృతిక్ రోషన్, సుసానే ఖాన్ మధ్య ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని ఫరా తెలిపారు. ఇద్దరూ తమ పిల్లల కోసం తరచూ కలిసి కనిపిస్తుంటారని, ఇరు కుటుంబాల మధ్య కూడా ఇప్పటికీ మంచి అనుబంధం కొనసాగుతోందని చెప్పారు.