హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధిచేసేందుకు.. భవిష్యత్తులో అనూహ్యమైన విపత్తులను ఎదుర్కోవడానికి వీలుగా మౌలిక వసతులు కల్పించడానికి రూ.పది వేల కోట్లతో కార్యాచరణ చేపట్టినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆదివారం సిరిసిల్లలో మాట్లాడుతూ.. ‘ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దయ్యం.. కరోనా పాడుగాను. చానా పరేశాన్ చేసింది మనల్ని. చరిత్రలో కనీవినీ ఎరుగలే. లాక్డౌన్ అనంగనే మొత్తం బంద్. మూతికో బట్ట కట్టుకొని ఇంట్ల ఉండాలె. మొత్తం బంద్ అంటే ఎట్ల? మామూలు వ్యవహారాలకు లాక్డౌన్ చేస్తం గానీ.. జీవితానికి చేయలేం కదా. మనం ఎన్నడూ ఎదుర్కోని చాలా దుర్భర పరిస్థితి అది. మనం ఏం చేయలేమా? అని ఒకరిని అడిగితే ‘ఏం చేయలేం సార్’ అని అన్నరు.
ఇదే సమయంలో మిడుతల దండు రూపంలో మనకు ఇంకో గొప్ప అనుభవం వచ్చింది. మిడుతలు చాలా ప్రమాదకరం. శ్రీనాథ మహాకవి చివరిరోజుల్లో నిరాదరణకు గురైతే.. వడ్డేపల్లి అనే ఊర్లో పొలం కౌలుకు తీసుకున్నరు. వ్యవసాయంచేస్తే మిడుతలు ఒచ్చి మేశిపోతయి. ఆయన జైలులో ఉండి సచ్చిపోయే ముందు తనను ఏయే రాజులు ఎట్లా సన్మానించినరో రాస్తూ ‘బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు. కృష్ణవేణమ్మ కొనిపోయే కొంత పసలు. ఎట్లు చెల్లింతు టంకంబులేడు నూర్లు’ అని బాధపడుతడు. బిలబిలాక్షులు అంటే మిడుతలు. తిలలు అంటే నువ్వులు, పెసలు అంటే పెసర్లు. మిడుతల గోస అట్ల్ల ఉంటది. ఈ మిడుతలు మనకు సెంట్రల్ ఏషియా నుంచి వస్తయి. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల దాకా వచ్చి అటునుంచి అటే పోతయి. మొన్నటిసారి వాటికి ఎట్లా దారి దొరికిందో ఏమో గానీ.. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ దాటినయి. తెలంగాణ దిక్కు వస్తున్నయని చెప్పంగనే మందులు, ఫైరింజన్లు అన్నీ రెడీగా పెట్టినం. మన అదృష్టం కొద్దీ అవి రాలే. ఆ సందర్భంలో వచ్చిన ఎంటమాలజిస్టులను నేను కూర్చోబెట్టి అడిగిన.
‘ఈ మిడుతలు పాతయి కదా. వీటికి ఏదైనా చేయొచ్చు కదా’ అంటే వాళ్లు ఏం చేయలేము అన్నరు. ఎందుకు చేయరాదు అని అడిగితే ‘సార్.. మనిషి ఈ భూమి మీదికి నాలుగు లక్షల ఏండ్ల కిందట ఒచ్చిండు. కానీ అనేక రకాల వైరస్లు, మిడుతలు అంతకన్నా ముందే.. 8 లక్షల ఏండ్ల కిందట వచ్చినయి. వాటికి ప్రకోపం రాకుండా ఉండేటట్టు మన ప్రకృతి మంచిగుంటే తక్కువ వస్తయి. ఎక్కడైతే పర్యావరణాన్ని ధ్వంసంచేసి మన కాళ్లు మనమే నరుక్కుంటమో అక్కడ ఎక్కువ వస్తయి’ అని చెప్పిన్రు. మరి ఏం చేయాలి? అని అడిగితే ‘భవిష్యత్తులో కూడా వస్తయి సార్. మీరు హరితహారం అనుకుంట తిప్పలు పడుతున్నరు. కానీ వేరే రాష్ర్టాల్లో అట్లా చేస్తలేరు. కాబట్టి మీరు వైరస్ వస్తే ఎదుర్కొనేలా వైద్యరంగంలో మౌలిక వసతులు పెంచుకోవాలి’ అని చెప్పిన్రు. అందుకే గత క్యాబినెట్లో రూ.10 వేల కోట్లతో వైద్యరంగంలో మౌలిక వసతులు పెంచాలని నిర్ణయం తీసుకున్నం.
వైద్య సిబ్బందికి సెల్యూట్
ఇరిగేషన్ ఎంబడిపడి కాళేశ్వరం ఎట్లా తెచ్చినమో.. అట్లా వైద్యరంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నం. దాంట్లో భాగంగానే కొత్త మెడికల్ కాలేజీలు పెడుతున్నం. దాంతోపాటు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ దవాఖాన వస్తది. ఎక్కడికక్కడ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు రావాల్ననే ఉద్దేశంతో ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ తేవాల్నని నిర్ణయించినం. కొత్తగా ఏడు కాలేజీలు తీసుకొస్తున్నం. కేటీఆర్ కూడా అందుకే తెలివిగా ఏది అడుగాల్నో అదే అడిగిండు. మీరు సిరిసిల్ల వచ్చి ఇనాగ్రేషన్ చేశిపోతే సాలు అని చెప్పి.. ఇక్కడికొచ్చినంక మెడికల్ కాలేజీ కథ వెట్టిండు. వచ్చే దఫాలో సిరిసిల్లకు వందశాతం మెడికల్ కాలేజీ మంజూరుచేస్తం. కరోనా సమయంలో దైర్యంగా పోరాటం చేసిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా.
కరోనా వస్తే తండ్రినే కొడుకులు ఇంట్లకు రానియ్యలే. అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి అద్భుతంగా పనిచేశిన్రు. నేను ఒక్క మాట చెప్పంగనే సీఎస్, హెల్త్ సెక్రటరీ నేతృత్వంలో మెడికల్ కిట్లు తయారుచేశి, ఇంటింటికీ జ్వర సర్వే చేశి కిట్లు అందించిన్రు. ఇయ్యాల తెలంగాణ బాట పట్టాల్నని దేశం మొత్తం చూస్తున్నది. జ్వర సర్వే చేయమని చెప్తే ఆశాలు, ఏఎన్ఎంలు, నర్సులు బ్రహ్మాండంగా పనిచేశిన్రు. అట్లాంటివాళ్లు ఇంకా రావాలె. అందుకే నర్సింగ్ కాలేజీలు 7 మాత్రమే ఉంటే, ఇంకో 13 మంజూరు చేసుకున్నం.
నర్సింగ్ విద్యార్థుల ైస్టెపెండ్ పెంపు
సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీ ఇనాగ్రేషన్ సందర్భంగా పిల్లలు ‘సార్.. మాకు ఎప్పుడో జమానాలో పెట్టిన ైస్టెపెండ్ ఉన్నది. రూ.1500, రూ.1700, రూ.1900 ఇస్తున్నరు. చాలా ఇబ్బందులు పడుతున్నం. అందరినీ ఆదుకున్నట్టే మమ్ములను కూడా ఆదుకోండి’ అని కోరిన్రు. వాళ్లు సమాజానికి అవసరం కాబట్టి ైస్టెపెండ్ పెంచుతున్నం. ఇకపై మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.5 వేలకు, రెండో సంవత్సరం వాళ్లకు రూ.1700 నుంచి రూ.6 వేలకు, మూడో సంవత్సరం వాళ్లకు రూ.1900 నుంచి రూ.7 వేలకు పెంచుతున్నం. పిల్లలు మంచిగ చదువుకొని సమాజానికి మంచి చేయాలె.