హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు స్ఫూర్తిని ఆదర్శంగా ముందు తరాలకు తీసుకొనిపోవడానికి వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని స్థాపించబోతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. పీవీ.. భారతదేశ కీర్తి కిరీటమని, సంస్కరణల దీపస్తంభమని శ్లాఘించారు. కవి, పండితుడు, విద్యానిధి, సాహిత్య పెన్నిధి అయిన పీవీ, రాజకీయరంగంలో రాణించిన తీరు, చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, దేశానికి ఆయన చేసిన మార్గదర్శనం నిరంతరం ప్రజ్వలిస్తూ ఉండాలని అభిలషించారు. సోమవారం పీవీ నరసింహారావు మార్గ్లోని జ్ఞానభూమిలో పీవీ శతజయంతి ముగింపు సమారోహాన్ని అట్టహాసంగా నిర్వహించారు. శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ముందుగా సర్వమత ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మొద ట నెక్లెస్రోడ్డుకు పీవీ మార్గ్గా మారుస్తూ ఏర్పాటుచేసిన సైన్బోర్డును గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆవిష్కరించారు.
ఆ తర్వాత పీవీ మార్గ్లో ఏర్పాటుచేసిన 16 అడుగుల పీవీ నరసింహారావు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సభ ప్రారంభానికి ముందు నమస్తే తెలంగాణ పత్రిక రూపొందించిన ‘నమస్తే పీవీ’ వ్యాస సంకలనం, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మీడియా సలహాదారుగా వ్యహరించిన సంజయ్బారు రూపొందించిన కాఫీ టేబుల్బుక్, మరో ఎనిమిది పుస్తకాలను గవర్నర్ విడుదలచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఉత్సవాలు ఏడాదిపాటు సుసంపన్నమయ్యాయన్నారు. ఈ వేడుకలను సఫలం చేయడానికి కొందరు కలాలతో, మరికొందరు గళాలతో, హృదయాలతో కృషిచేశారంటూ.. వారందరికీ ధన్యవాదా లు తెలిపారు. 84 ఏండ్ల పరిపూర్ణ జీవితకాలంలో అద్భుతమైన సంస్కరణశీలిగా పీవీ నిలిచారని కొనియాడారు. పీవీ ఎక్కడ ఎలాంటి పదవులు చేపట్టినా.. అక్కడ సంస్కరణలను అమలుచేశారని గుర్తుచేశారు. అందుకు దేశవ్యాప్తంగా విద్యాసుగంధాలను విరజిమ్ముతున్న నవోదయ గురుకులాలే నిదర్శనమన్నారు. పీవీ స్థాపించిన సర్వేల్ గురుకులంలోనే విద్యనభ్యసించి నేడు డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న మహేందర్రెడ్డి పీవీ సంస్కరణల ఫలమేనని చెప్పారు. రాష్ట్ర, దేశస్థాయిలో సమయానుకూల, కాలానుకూల నిర్ణయాలు తీసుకొన్న నేత పీవీ అని తెలిపారు. భూ సం స్కరణలను చేపట్టడమే కాకుండా, తన ఇంటి నుంచే దానికి అమలుచేసిన ఆదర్శమూర్తి అని కీర్తించారు.
కడుపు నిండినంత ఆనందం..
నెక్లెస్రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం చేయడమేగాక, అక్కడ పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం కడుపునిండినంత ఆనందంగా ఉన్నదని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. విగ్రహాన్ని అత్యద్భుతంగా, పీవీనే స్వయంగా అక్కడ నిలబడిన రీతిలో తీర్చిదిద్దిన కళాకారులకు, అందుకు కృషి చేసిన ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్లో ప్రభు త్వం చేపట్టబోయే పలు కార్యక్రమాలకు కూడా పీవీ పేరును పెడతామని వెల్లడించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వారి కుటుంబాన్ని గౌరవించుకోవడంలో భాగంగా, ఆయన కుమార్తె వాణీదేవికి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ గా, ఆదరించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పీవీ ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ముం దుకుసాగాలని, ప్రగతిశీల భావజాలాన్ని మననం చేసుకుంటూ, సమాజ అభ్యున్నతికి పాటుపడటమే ఆయనకు ఇచ్చే ఘననివాళి అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పీవీ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటేలా సభలు, సమావేశాలను అంతర్జాతీయ, జిల్లా, వివిధ రాష్ర్టాల్లోనూ ఘనంగా నిర్వహించిన శతజయంతి ఉత్సవ కమిటీని, వారికి సహకరించిన అధికార బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అదే దారిలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పీవీ జ్ఞానభూమిలో పీవీ మెమోరియల్ను నిర్మించాలని ఆదేశించారు.
ఇది పండుగ రోజు: గవర్నర్ తమిళిసై
పీవీ జయంతి ఒక పండుగరోజుగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అభివర్ణించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించిన మహనీయుడని శ్లాఘించారు. తన ముద్దుబిడ్డకు తెలంగాణ సమాజం ఘనమైన నివాళి అర్పించిందని, పీవీ మార్గ్లో ఏర్పాటుచేసిన విగ్రహం అందుకు నిదర్శనమని కీర్తించారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు జీవితానికి సంబంధించిన, దేశ చారిత్రక నేపథ్యమున్న అనేక ఫొటోలు, రచనలను వెలుగులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేశారు. శతజయంతి ఉత్సవాలను ఏడాదికాలం నిర్వహించడం పై ఆనందం వ్యక్తంచేయడంతోపాటు అందుకు చొరవ చూపిన రాష్ట్ర ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
చాలా గొప్ప అవకాశం: కే కేశవరావు
పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్గా వ్యవహరించడం గొప్ప అవకాశమని ఉత్సవ కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులు, ఆ సవాళ్లను అధిగమించి సమిష్టి సహకారం వల్లే పీవీ ఠీవిని నలుదిశలా చాటేలా కార్యక్రమాలను చేపట్టామని, 50 వెబినార్లను నిర్వహించామని వెల్లడించారు. త్వరలోనే పోస్టల్ స్టాంప్ను విడుదల చేయనున్నామని చెప్పారు. హైదరాబాద్ సెంట్ర ల్ వర్సిటీకి పీవీ పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి కేకే విజ్ఞప్తి చేశారు.
పీవీ ఖ్యాతిని చాటేలా ఉత్సవాలు
పీవీ ఘనతపై దశాబ్దాలుగా ఆవహించిన మబ్బు లు తొలిగిపోయేలా, ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహించిందని పీవీ కుమారుడు ప్రభాకర్రావు కొనియాడారు. అందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్కు తమ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పీవీని 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరించేలా కార్యక్రమాలను నిర్వహించారని ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ, పీవీ కుమా ర్తె వాణీదేవి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
ముందుతరాలకు ఆదర్శంగా
దేశం అనేక సంక్లిష్ట సమస్యల్లో కూరుకుపోయిన తరుణంలో పీవీ.. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లు నడిపించడమే గాక భారత్ను ప్రగతిపథంలో నడిపించిన మహనీయుడని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. నేడు దేశంలో డబ్బు చలామణి పెరగడానికి, అంతర్జాతీయ కంపెనీలు రావడానికి పీవీ అమలుచేసిన ఆర్థిక సంస్కరణలే మూలస్తంభాలని స్వయంగా మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ పలు సందర్భాల్లో తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. సం స్కరణశీలి, అధ్యయనశీలి, పరిణామశీలిగా నడిచిన పీవీ చిరస్మరణీయులని, వారి స్మరణ ఎప్పుడూ ప్రజ్వలిస్తుండాలని ఆకాంక్షించారు. వారి స్ఫూర్తి, ఆదర్శంగా ముందుతరాలు నడిచేందుకు వీలుగా కాకతీయ విశ్వవిద్యాలయం లో పీవీ విద్యాపీఠం ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. కేయూ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. పీవీ ఆదర్శాలను విద్యాపీఠం నెరవేర్చాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
పీవీ ప్రజ్ఞను వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే’
నమస్తే తెలంగాణ కృషిని ప్రశంసించిన సీఎం
పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పీవీ ప్రజ్ఞాపాటవాలను విశ్వానికి చాటిచెప్పడంలో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక విశేష కృషి చేసిందని సీఎం కేసీఆర్ అభినందించారు. ‘నమస్తే తెలంగాణ పత్రిక విశేషమైనటువంటి కృషిచేసింది. ఎవరు కృషిచేసినా వారు ప్రశంసలకు పాత్రులు. పీవీ ప్రజ్ఞను అనేక విధాలుగా.. ఆయన ఎంత గొప్ప ప్రతిభాశాలో, మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని ప్రపంచానికి చాటిచెప్పటంలో ఆ పత్రికవారు చాలా కృషిచేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పీవీ గురించి బహుముఖం గా కొత్త తరానికి, సమకాలీన సమాజానికి తెలియాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలి. నమస్తే తెలంగాణ పత్రిక ధారావాహికంగా పీవీ ప్రజ్ఞాపాటవాలు, రాజకీయ చతురత, సంస్కరణలకు సంబంధించి అనేక వ్యాసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ వ్యాసాలను సంకలనం చేసి ఈ రోజు పుస్తకరూపంలో కూడా వెలయింపజేశారు. వారికి ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ అముద్రిత రచనలను ప్రచురించిన ఉత్సవ కమిటీ, అందులో సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పీవీ గొప్ప ఆధ్యాత్మిక వేత్త
నివాళి అర్పించిన విశాఖ శారదాపీఠం
భారతీయుల గుండెల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరు చిరస్థాయిగా నిలుస్తుందని విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. సోమవారం పీవీ శతజయంతి సందర్భంగా ఆయన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పీవీని గుర్తుచేసుకున్నారు. విశాఖ శారదాపీఠంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేదని, పీవీ స్వగ్రామంలో తమ చేతుల మీదుగా శివాలయం ప్రతిష్ఠాపన జరిపించారని గుర్తుచేశారు. పీఠాన్ని సందర్శించడానికి పీవీ ప్రత్యేకంగా విశాఖ వచ్చినట్టు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
పీవీ శతజయంతి కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల
మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు, ఉత్సవాల్లో తెలంగాణ ఎన్నారైలను భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్కు ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విదేశాల్లో ఉన్న పీవీ అభిమానులందరినీ ఏకం చేశామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వివిధ దేశాల్లో ప్రత్యక్షంగా, జూమ్లలో పాల్గొనేలా చేసి పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించామని చెప్పారు.
బహుభాషా కోవిదుడు పీవీ
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి.
దేశం అనేక సంక్లిష్ట సమస్యల్లో
కూరుకుపోయిన తరుణంలో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లు నిర్వహించడమే గాక భారత్ను ప్రగతిపథంలో నడిపించిన మహనీయుడు పీవీ నరసింహారావు. నేడు దేశంలో డబ్బు చెలామణి పెరగడానికి, అంతర్జాతీయ కంపెనీలు రావడానికి పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలే మూల
స్తంభాలు. సంస్కరణశీలి, అధ్యయనశీలి, పరిణామశీలిగా నడిచిన పీవీ చిరస్మరణీయులు. వారి స్మరణ ఎప్పుడూ ప్రజ్వలిస్తుండాలి.
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు