అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చాం l జాతీయ సగటుకు మించి ఖర్చు చేస్తున్నాం
పరిమితి మేరకే అప్పులు తీసుకొస్తున్నాం l బడ్జెట్పై చర్చకు మంత్రి హరీశ్ సమాధానం
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమమే ప్రథమ ప్రాథమ్యాలుగా అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పు డు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. 2021-22 బడ్జెట్పై చర్చకు మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభ, మండలిలో సమాధానమిచ్చారు. విద్యారంగంపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శ సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంక్షేమ పథకాలు, గురుకులాలపై పెడుతున్న ఖర్చు విద్యాశాఖ బడ్జెట్లో కాకుండా సంక్షేమం కిందకు వస్తాయని చెప్పారు. అవన్నీ కలుపుకొంటే విద్యారంగంపై ఇతర రాష్ర్టాలకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామన్నారు.
కాగ్ నివేదిక ప్రకారం 2014 నుంచి 2020 వరకు రూ.96,220 కోట్లు ఖర్చుచేశామని.. ఇది బడ్జెట్లో 14.15 శాతమని తెలిపారు. అరవై ఏండ్లలో రాష్ట్రంలో 6,093 కిలోమీటర్ల మేర డబుల్ లేన్ రోడ్లు ఉంటే.. తెలంగాణ ఏర్పడ్డాక ఆరేండ్లలో 7,189 కిలోమీటర్లు కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. 360 కిలోమీటర్లు నాలుగులేన్ల రోడ్లు, 430 బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. ఆర్అండ్బీ పరిధిలో రూ.4,120 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫ్లైఓవర్ల అభివృద్ధికి రూ.5,852 కోట్లు ఖర్చుచేశామని.. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై చేసిన ఖర్చు ఆర్అండ్బీ పద్దులో ఉండదని పేర్కొన్నారు. రూ.34,367 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామని.. తాగునీటి సమస్యను తీర్చిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకున్నదని తెలిపా రు.
వ్యయసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై జాతీయ సగటు 6.4% కాగా, తెలంగాణలో 11.4% ఖర్చు చేస్తున్నామని వివరించారు. విద్యుత్తు రంగంపై ఖర్చు జాతీయ సగటు 5.7% ఉంటే.. రాష్ట్రంలో 7.3 శాతంగా ఉన్నదన్నారు. సామాజిక భద్రత, వరదల నివారణ, గృహనిర్మాణం తదితరాల్లో జాతీయ సగటు కంటే ముందున్నామని తెలిపారు. 2014 కు ముందు తలసరి ఆదాయం రూ.1,24,104 కాగా, ప్రస్తుతం రూ. 2,27,145కు చేరుకున్నదని చెప్పారు. నిరుద్యోగంలో జాతీయ సగటు 7.6% ఉంటే తెలంగాణలో 4.53% మాత్రమే ఉన్నదని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకుంటున్నదని హరీశ్రావు చెప్పారు. ఇందులో భాగంగానే ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించామని, విజయ డెయిరీని అప్పుల ఊబి నుంచి కాపాడి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే స్థాయికి చేర్చామని వివరించారు.
కేంద్రం నుంచి రావాల్సినది రూ.28,225 కోట్లు
ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ర్టాలకు పరిమితులకు లోబడి అప్పు తీసుకునే స్వేచ్ఛ ఉన్నదని.. అయినా అతి తక్కువ అప్పులు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. అధిక అప్పులున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలైన పంజాబ్, రాజస్థాన్ ముందువరుసలో ఉంటే.. తెలంగాణ 25వ స్థానంలో ఉన్నదని తెలిపారు. భూములు, నిరర్థక ఆస్తుల అమ్మకంతో నిధులు సమకూర్చుకుంటామన్నారు. సంక్షేమ పథకాలకు కేంద్రం ఇస్తున్నది 1.2% మాత్రమేనని.. రాష్ట్రం నుంచే 98.8% ఖర్చుచేస్తున్నామని తెలిపారు. 14వ, 15వ ఆర్థిక సంఘం కేటాయింపులతోపాటు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.28,225 కోట్లు రావాల్సి ఉన్నదన్నారు. ఓయూలో ఖాళీ పోస్టుల భర్తీపై కోర్టులో స్టే ఉన్నదని, దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల్లోనూ ఇదే పరిస్థితి అని చెప్పారు.