హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తికావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కృష్ణా బేసిన్లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయడానికి అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలన్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పురోగతిపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ నీటి గోసను, నల్లగొండ నీటి కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగ్లో పెట్టారు. తెలంగాణ వచ్చాక ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసుకుంటూ వస్తున్నాం. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులు వేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నది’ అని చెప్పారు. జూరాలతోపాటు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులను పూర్తిచేసి దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నామని సీఎం గుర్తుచేశారు. ఇంకా కొసరుగా మిగిలినవాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు
గోదావారి ప్రవాహానికి, కృష్ణా నది ప్రవాహానికి తేడా ఉంటుందని, సముద్రం వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతే.. కృష్ణా ప్రవాహం తగ్గుతూ వస్తుందని సీఎం కేసీఆర్ విశ్లేషించారు. రానురాను వర్షాలు తగ్గిపోవడం, దానికి తోడు కృష్ణానదిపై ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నిర్మించిన ప్రాజెక్టులకుతోడు దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటుచేసిన తూములతో నదిలో నీటిలభ్యత ప్రమాదంలో పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసిపట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్ణానదిపైన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. కృష్ణాజలాలను మలుపుకొని పాలమూరును పూర్తిస్థాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామని, ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే రైతన్నలు, వ్యవసాయానికి అంత మంచిదని, ఈ పథకాన్ని జూరాలతో లింక్ చేసుకోవచ్చని సీఎం వివరించారు.
వేగం పెంచాల్సిందే
పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం చేపట్టబోయే భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, కాలువల తవ్వకం, పంపుల ఏర్పాటు తదితర పనులపై సీఎం కేసీఆర్ ఆరాతీశారు. భూసేకరణ పునరావాసం కోసం ఎంత డబ్బు అవసరం? ఇంకా పెండింగ్లో ఉన్న భూసేకరణ వివరాలను, మొత్తం రిజర్వాయర్లు, వాటి సామర్థ్యం, నీటి నిల్వ పెంచే అవసరమున్నదా! అన్న విషయాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. అక్కడక్కడా పనులు ఆలస్యమవుతుండటంతో మరింత వేగంగా పనిచేయాలన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెంల వద్ద పంపులను త్వరలో బిగించాలన్నారు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు టన్నెల్ నిర్మాణానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇంజినీర్లను ఆరాతీశారు. జూన్ నెలాఖరు కల్లా పనులు పూర్తికావాలన్నారు. వట్టెం నుంచి కరివెన వరకు కెనాల్ జరిగిన పనులు, కాలువ లైనింగ్ కోసం జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కావాల్సినన్ని నిధులిస్తున్నా పనులు జాప్యం కావడంపై అధికారులను ప్రశ్నించిన సీఎం.. ఇక ఆలస్యం జరుగొద్దని స్పష్టంచేశారు.
వారానికోసారి సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావును ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎంత వేగంగా జరిగాయో అర్థంచేసుకొని, అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల పనులను శరవేగంగా పూర్తిచేయాలన్నారు. ఇరిగేషన్ శాఖలో వివిధస్థాయి అధికారులకు నిధులను అందుబాటులో ఉంచామని సీఎం గుర్తుచేశారు. చిన్నచిన్న పనులకు హైదరాబాద్ వరకు రానవసరం లేకుండా ఎక్కడి అధికారి అక్కడే తమ నిధులను ఖర్చుచేస్తూ పనులను చేపట్టే వెసులుబాటు కల్పించిందన్నారు. ప్రభుత్వం పనుల నిర్వహణను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు మనసుపెట్టి పనిచేయాలన్నారు. నీటిపారుదలశాఖ తెలంగాణకు జీవనరేఖ (లైఫ్లైన్) వంటిదని సీఎం అభివర్ణించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్యయాదవ్, కృష్ణమోహన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రామ్మెహన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.