హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు మూలాధారమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)కు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నదా? పేదలకు సబ్సిడీ మీద ఆహార ధాన్యాలు పంపిణీచేసే బదులు వంటగ్యాస్కు ఇస్తున్నట్టుగా నేరుగా నగదు బదిలీచేయనున్నదా? ధాన్యం కొనుగోలుపై ఇటీవల కేంద్రం వైఖరి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. బియ్యం, గోధుమ నిల్వలు అధికంగా ఉన్నాయన్న పేరుతో వీటి సేకరణను ఇప్పటికే భారీగా తగ్గించింది. ఎఫ్సీఐని మూసేసి, నగదు బదిలీచేయాలని గతంలో శాంతకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. పీడీఎస్ కోసమే ప్రస్తుతం ఎఫ్సీఐ అత్యధికంగా బియ్యం, గోధుమలు సేకరిస్తున్నది. ఈ వ్యవస్థలో నగదు బదిలీ ప్రవేశపెడితే ఈ ఆహార ధాన్యాలను స్వయంగా సేకరించాల్సిన అవసరం ఉండదు. ఈ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నదని అనుమానిస్తున్నారు. ఈ విధానం ఎప్పుడైనా అమల్లోకి రావొచ్చని చెప్తున్నారు.
యాసంగి, వానకాలం తేడా లేకుండా కేంద్రం ఆహార ధాన్యాల సేకరణను భారీగా తగ్గించింది. బా యిల్డ్ రైస్ వినియోగం తగ్గిందన్న సాకుతో యాసంగిలో ధాన్యం సేకరణను నిలిపేస్తున్నది. వానకాలం పంట సేకరణపై స్పష్టత ఇవ్వటంలేదు. పీడీఎస్ను కొనసాగించాలంటే కోట్లమంది పేదలకు సరిపడా ఆహారధాన్యాలను సేకరించాల్సి ఉంటుంది. దీనిపై హామీ ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడుతున్నదంటే రహస్య ఎజెండా అమలుకోసమేనని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ఆహార ధాన్యాల సేకరణను ఏటా కొంతవరకు తగ్గిస్తూ పోయి.. చివరకు ఎఫ్సీఐని మూసివేసే అవకాశం ఉన్నదని చెప్తున్నాయి.
రైతుల పోరాటంతో ఇటీవల కేంద్రం వెనక్కు తీసుకున్న సాగుచట్టాల్లో రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పారు. అన్నదాతల నుంచి భవిష్యత్తులో ప్రభుత్వం నేరుగా ఆహారధాన్యాలు సేకరించబోదని దాని సంకేతమని అప్పుడే రైతు సంఘాలు ఆరోపించాయి. ఇప్పుడు ఆ చట్టాలను రద్దుచేసినా అదే విధానాన్ని మరో రూపంలో కేంద్రం అమలుచేయబోతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్సీఐ బియ్యం, గోధుమలు సేకరించకపోతే రాష్ట్రప్రభుత్వాలు రైతుల నుంచి వాటిని కొనవు. అప్పుడు రైతులు అనివార్యంగా ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి అన్నదాతలను మరింత అప్పులపాటు చేయటం ఖాయమని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధంచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. పీడీఎస్లో నగదుబదిలీ ద్వారా ఎంఎస్పీని పూర్తిగా నీరుగార్చి, చివరకు ఆ వ్యవస్థనే రద్దుచేయవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు ఆందోళన చెందుతున్నారు.
బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. రైతులను వరిసాగు నుంచి ఇతర పంటల వైపు ప్రోత్సహించండి. -రాష్ర్టాలకు కేంద్రం సూచన
‘కేంద్రం అవసరాలు, దేశ అవసరాలకు అనుగుణంగానే ధాన్యం సేకరిస్తాం. -కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
బాయిల్డ్ రైస్ వాడకం తగ్గింది. నిల్వలు పెరిగాయి. ఇకపై యాసంగిలో బాయిల్డ్ కొనుగోలు చేయబోం. -కేంద్ర ప్రభుత్వం