కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 13: కరీంనగర్ డెయిరీకి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) నిధులు మంజూరు కావడం ఎంతో గొప్ప విషయమని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు. కరీంనగర్ డెయిరీ నుంచి ఇన్నాళ్లూ డెయిరీ పేరుతో పెరుగును అమ్ముతుండగా, తాజాగా డెయిరీ నుంచి 16 రకాల ఐస్క్రీంలు, బిస్కట్లను, మానేరు బ్రాండ్తో టోన్డ్మిల్క్ పెరుగు బకెట్లను వినోద్కుమార్ చేతుల మీదుగా సోమవారం సాయంత్రం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద రూ.90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, ఇందులో రూ.71.52 కోట్లు రుణం కాగా, రూ.12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో రూ.6.72 కోట్లు కరీంనగర్ డైయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నదని వెల్లడించారు.
ఈ రుణానికి 1.5 శాతం మాత్రమే వడ్డీ చెల్లించనుండగా, దీన్ని వచ్చే పదేండ్ల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిధులను పాల సేకరణ సంస్థలు, భవనాలు, పాల పరీక్ష యంత్రాలు, పాల క్యాన్లు, పాల సేకరణ యూనిట్లు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాల కోసం వినియోగించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు ఉత్పత్తులను రెండింతలు చేసిన డెయిరీ.. ఇప్పుడు తమ సభ్యులను కూడా రెండింతలు చేసుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులకు హైదరాబాద్లో మంచి గిరాకీ ఉన్నదని, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందిస్తున్నదని తెలిపారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ వద్ద సుమారు రూ.100 కోట్లతో 5 లక్షల లీటర్ల సామర్థ్యంగల డెయిరీని నిర్మించారని, త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు మాట్లాడుతూ కమర్షియల్ అవసరాల కోసం మానేరు నది పేరుతో కొత్త బ్రాండ్ పెరుగు బకెట్లను తీసుకువచ్చామని తెలిపారు.