అందోల్, డిసెంబర్ 31: రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అండగా నిలిచారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం నాందేడ్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ శివారులో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 9నెలల బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలోఅందోల్ నియోజకవర్గంలో తన పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్నఎంపీ బీబీ పాటిల్ ప్రమాదాన్ని చూసి వెంటనే తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం అతడిని 108లో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అందోల్ ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు.