హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో వీరశైవ లింగాయత్ కులస్థులు అభివృద్ధి బాటన పయనిస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లింగాయత్ సమాజం అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ సమానమేనన్న భావనతో ముందుకెళ్లిన మహాత్మా బసవేశ్వరుడి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో తొలిసారి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వరుడి జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ట్యాంక్బండ్పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, బసవభవన్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్.. బసవేశ్వరుడికి కాంస్య విగ్రహం ఏర్పాటుకు అంగీకరించారు. దీంతోపాటు బసవ భవన్ నిర్మాణం కోసం కోకాపేటలో ఎకరా స్థలంతోపాటు నిర్మాణానికి నిధులు కేటాయించారు.
రాజకీయ రంగంలోనూ లింగాయత్ కులస్థులకు పెద్దపీట దక్కేలా బీబీ పాటిల్ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు బసవభవన్ భూమిపూజకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేని తమకు స్వరాష్ట్రంలో బీబీ పాటిల్ చొరవ, సీఎం కేసీఆర్ కృషితో ప్రత్యేక గుర్తింపు దక్కిందని లింగాయత్లు సంతోషపడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా తమకు ప్రాధాన్యం దక్కలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి.. ఎంపీ బీబీ పాటిల్ క్రియాశీలక పాత్ర ఫలితంగా బసవభవన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అకోబర్ 2న కోకాపేటలో బవసభవన్ భూమిపూజ కార్యక్రమానికి స్వచ్ఛందగా తరలిరావడానికి వీరశైవ లింగాయత్లు సన్నద్ధం అవుతున్నారు.