హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య విభేదాలున్నాయనేది ఒట్టి కట్టుకథేనని స్పష్టమైంది. షర్మిల.. జగన్ వదిలిన బాణమేనని, తెలంగాణలో తన సోదరిచేత ఆయనే పార్టీ పెట్టించారనే విమర్శలకు బలం చేకూరుతున్నది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆమె తల్లి విజయమ్మ జెండా ఊపి ప్రారంభించడం, ఐదోరోజు మహేశ్వరం నియోజకవర్గం నాగారంలో షర్మిలతో వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్థుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ కావడంతో అన్నాచెల్లెలు కలిసే రాజకీయ నాటకం ఆడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలపడం, సుమారు గంటపాటు వారిద్దరు సమావేశమవటం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ దూతగానే సుబ్బారెడ్డి షర్మిలను కలిశారని భావిస్తున్నారు. ఆయనను వైఎస్సార్టీపీ నాయకులు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్రెడ్డి, వాడుక రాజగోపాల్, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్దాది సాదరంగా ఆహ్వానించారు. పాదయాత్ర కొనసాగుతున్న తీరును వైవీ సుబ్బారెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇతర నేతలను బయటికి పంపించి షర్మిల, సుబ్బారెడ్డి ఏకాంతంగా చర్చలు జరిపారు. పాదయాత్రకు ఈ ఐదు రోజుల్లో వచ్చిన ప్రజా స్పందన గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారని సమాచారం. పాదయాత్ర కొనసాగింపు విషయంపైనా వారు చర్చించినట్టు తెలిసింది. షర్మిల తల్లి విజయమ్మను కూడా సుబ్బారెడ్డి కలువనున్నారు. ఏపీలో జగన్ పాదయాత్రను పర్యవేక్షించిన బృందమే షర్మిల ప్రజాప్రస్థానం యాత్రను పర్యవేక్షిస్తుండటంతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేధాలు లేవని స్పష్టమవుతున్నది.