హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నాలుగేండ్ల పదవీకాలంలో తీసుకున్న చర్యలను వివరించారు. తిరుమలలో సామాన్య భక్తులకు కల్పించిన సేవా కార్యక్రమాలు తనకు సంతృప్తినిచ్చాయని తెలిపారు. నూతన చైర్మన్గా నియమితులైన భూమన కరుణాకర్రెడ్డి అనుభవం టీటీడీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీకి భారీగా విరాళాలు…
తిరుమల దేవస్థానానికి భక్తులు భారీ విరాళాలు అందజేశారు. టీఎన్ఎల్ఏసీ అధ్యక్షుడు శేఖర్రెడ్డి నేతృత్వంలో 9 మంది భక్తులు రూ.5.11 కోట్లను చైర్మన్కు అప్పగించారు. ఈ నిధులు చెన్నై టీనగర్ వెంకటనారాయణ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ కోసం అవసరమైన స్థల సేకరణ కోసం అందజేశారు. ఈ స్థలానికి రూ.35 కోట్లు అవసరం కాగా, భక్తుల ద్వారా ఇప్పటికే రూ.8.15 కోట్లు టీటీడీకి అందాయి. ర్యాపిడ్కేర్ జీఆర్పీ నుంచి రూ.1.50 కోట్లు సమకూరాయి. కోయంబత్తూరుకు చెందిన పలు ప్రైవేటు సంస్థల యజమానులు కూడా విరాళాన్ని అందజేశారు.