రామగుండం ప్లాంటు ఆలస్యానికి కరోనా మహమ్మారి కారణమని ఎన్టీపీసీ సాకులు చెప్తున్నది. నిర్దేశిత గడువు (5.2.2020) నాటికి పూర్తి చేస్తే సమస్యలు వచ్చేవికావు. 2020 మార్చి రెండో పక్షం తర్వాతే దేశంలో కరోనా ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించారు. అంటే ప్లాంట్ పనుల ఆలస్యానికి కరోనా కారణం కాదని స్పష్టమవుతున్నది.
ఆంధ్రా పత్రికలకు తెలంగాణపై పడి ఏడ్వటమే ఏకైక లక్ష్యంగా మారినట్టున్నది! కేంద్రం నుంచి రాష్ర్టానికి జరిగే అన్యాయాలు, వివక్షపై అక్షరమెత్తడానికి వెనుకాడే ఈ పత్రికలు.. తెలంగాణ ప్రభుత్వంపై విషం కక్కటానికి, అక్కసు వెళ్లగక్కడానికి మాత్రం రెండడుగులు ముందే ఉంటున్నాయి. గుడ్డుపై వెంట్రుకలు పీకే పని దొరికితే హుషారే హుషారు! తాజాగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు పూర్తి కాని విషయాన్ని ఈనాడు కనిపెట్టేసింది కానీ.. 2020 నాటికే పూర్తికావాల్సిన రామగుండం ఎన్టీపీసీ నిర్మాణం.. ఇంకా సాగుతూనే ఉన్న సంగతిని మాత్రం పక్కనపెట్టేసింది! ఎన్టీపీసీ రామగుండం 90% పూర్తయింది! అయినా పూర్తి చేయడానికి మరో ఏడాది సమయం కోరుతున్నది. మరి ఈనాడు రామగుండం పనుల్లో జాప్యంపై ఒక్క ముక్క అయినా ఎందుకు రాయటం లేదు?
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టు అది.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) మార్గదర్శకాల ప్రకారమైనా నాలుగేండ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు అది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ చేసుకొన్న ఒప్పందం ప్రకారం చూసినా 2020 ఫిబ్రవరి నాటికే తెలంగాణకు విద్యుత్తును అందించాల్సిన ప్రాజెక్టు అది.. గడువు దాటిపోయి రెండేండ్లయినా 90 శాతమే పనులు అయ్యాయి. మరో ఏడాది సమయం కావాలని ఎన్టీపీసీ కోరుతున్నది. ఈ ఆలస్యానికి ఎవరు బాధ్యులు? ఈ నిర్లక్ష్యానికి ఎవరిని నిలదీయాలి? ఇది నూటికి నూరుపాళ్లు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని స్పష్టంగా తెలుస్తున్నా, ఆంధ్రా పత్రిక ‘ఈనాడు’కు మాత్రం అలా కనపడలేదు. అది కనిపించలేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణం ఆలస్యమవుతున్నదని తెగబాధపడి పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించేలా వండి వార్చిన కథనాన్ని శుక్రవారం ‘యాదాద్రి వెలుగేదెప్పుడో’ అంటూ ప్రచురించింది. వైటీపీఎస్ పనుల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమనేలా చెప్పుకొచ్చింది. తెలంగాణపై విషం చిమ్మటంతోపాటు.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే ఆ కథనం లక్ష్యంగా కనపడుతున్నదని తెలంగా ణ వాదులు మండిపడు తున్నారు.
ఎన్టీపీసీకి కరోనా కారణమే కాదు
రామగుండం ప్లాంటు ఆలస్యానికి కరోనా మహమ్మారి కారణమని ఎన్టీపీసీ సాకులు చెప్తున్నది. కానీ మొదట నిర్దేశించుకొన్న గడువు (5.2.2020) నాటికి పూర్తి చేస్తే ఎలాంటి సమస్యలు వచ్చేవికావు. 2020 మార్చి రెండో పక్షం తర్వాతే దేశంలో కరోనా ప్రభావం కనిపించింది. లాక్డౌన్ ప్రకటించారు. అంటే ప్లాంట్ పనుల ఆలస్యానికి కరోనా ఏమాత్రం కారణం కాదని అర్థమవుతున్నది. కరోనా కాలం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొని నెలలు గడుస్తున్నా ఇంకా 90 శాతమే పనులు పూర్తయ్యాయి. దీంతో మొదటి యూనిట్ను వచ్చే ఏడాది సెప్టెంబర్లో, రెండో యూనిట్ను 2023 మార్చిలో పూర్తి చేస్తామని.. ఆ మేరకు గడువు పెంచాలని ఎన్టీపీసీ కోరుతున్నది. ఈ ఆలస్యం ప్రభావం విద్యుత్తు ఉత్పత్తి ధరలో తప్పకుండా ప్రతిఫలిస్తుందని విద్యుత్తు రంగ నిపుణులు చెప్తున్నారు.
కరోనాతోనే వైటీపీఎస్ ఆలస్యం
వైటీపీఎస్ను నాలుగేండ్లలో పూర్తిచేయాలని నిర్ణయించగా, పనులు వేగం పుంజుకొంటున్న దశలోనే కరోనా విజృంభించింది. వైటీపీఎస్లో సొంతంగా కరోనా పరీక్షలు, దవాఖాన ఏర్పాటు చేసినా కార్మికుల కొరతతో పనులు చేయలేకపోయారు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. అయినా, చివరిదైన ఐదో యూనిట్ కూడా జూన్ 2023 నాటికి (68 నెలల్లో) పూర్తిచేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయి. కానీ రామగుండంలోని ఎన్టీపీసీ మాత్రం రెండో యూనిట్ను మార్చి 2023 నాటికి అంటే.. 85 నెలల తర్వాతగానీ పూర్తి చేయలేమని చెప్తున్నది. కొత్తగూడెం ప్లాంటులోని ఏడో స్టేజ్ నిర్మాణం దేశంలోనే రికార్డు సృష్టించింది. 1.12015న పనులు ప్రారంభిస్తే.. 31.12.2018 నాడు పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసి గ్రిడ్కు అనుసంధానించారు. అంటే 48 నెలల్లోనే (నాలుగేండ్లు) ప్రాజెక్టు పూర్తి చేయడంతో రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడింది.
కేంద్రానిదే పూర్తి బాధ్యత..
రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటును కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నిర్మిస్తున్నది. ఈ సంస్థపై నిత్యం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మొత్తం తెలంగాణకు లభిస్తుంది. 2020 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉన్నది. కానీ గడువు ముగిసి రెండేండ్లు పూర్తయినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఈ ఆలస్యంపై కేంద్రం స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఈ ప్లాంటు ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈనాడుకు మాత్రం ఇది కనిపించక పోవడం విశేషం. కేంద్రం బాధ్యతను విస్మరించిందా? అన్న అనుమానమూ ఈనాడుకు కలుగలేదు. రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగూడెంలోని 7వ స్టేజీ (కేటీపీఎస్-స్టేజ్ 7), రామగుండంలో ఎన్టీపీసీ చేపట్టిన ప్లాంటు, దామరచర్ల సమీపంలో చేపట్టిన వైటీపీఎస్. ఈ మూడూ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్స్టేషన్లే. కొత్తగూడెంలోనిది ఒక యూనిట్ మాత్రమే కాగా, రామగుండం, వైటీపీఎస్లో ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు ఉన్నాయి.