ఖైరతాబాద్, నవంబర్ 6: తెలంగాణలో వైఎస్సార్టీపీ పని అయిపోయిందని, దీంతో ఆ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నామని పలువురు నేతలు స్పష్టం చేశారు. ఆ మేరకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రకటించారు. ‘ఏపీ షర్మిల.. గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గట్టు రాంచందర్రావు, బోయినపల్లి సత్యవతి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు చెందిన షర్మిలను కేవలం రాజన్న బిడ్డ అన్న ఏకైక కారణంతో ఆదరించామని, చివరకు ఆమె తెలంగాణపైనే కక్ష కడుతుందనుకోలేదని తెలిపారు. వైఎస్సార్టీపీని నిలబెట్టేందుకు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చామని, చివరకు లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లామని చెప్పారు.
చెమటోడ్చి పార్టీని నిలబెట్టాలని చూస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ నియంతృత్వంతో షర్మిల ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టి అప్పుల పాలయ్యామని, ఇలాంటి తరుణంలో పార్టీని నడిసంద్రంలో వదిలి కాంగ్రెస్ పంచన చేరడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెను కలిస్తే.. ‘నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అంటూ నీచంగా మాట్లాడారని వాపోయారు. ఇన్నేండ్లు ఆమె నాయకత్వాన్ని బలపర్చినందుకు సిగ్గుపడుతున్నామని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని తెలిపారు. నియంతృత్వ మనస్తత్వం కలిగిన షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరుగుతుందని, ఆమెను చేర్చుకుంటే కాంగ్రెస్ను సైతం వెలేస్తామని హెచ్చరించారు.
బయ్యారం గుట్టను, తెలంగాణను దోచుకోవడానికే షర్మిల ఇక్కడికి వచ్చారని, పనికిరాని పార్టీని పెట్టి ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న ఆమెను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామని వైఎస్సార్టీపీ నాయకుడు గణేశ్ నాయక్ తెలిపారు. తెలంగాణలో ఆమె ఎక్కడ పోటీచేసినా రాళ్లతో కొట్టి ఆంధ్రాకు తరమికొడతామని హెచ్చరించారు. అనంతరం రాజీనామా పత్రాలను ప్రదర్శించి, కండువాలను తీసివేశారు. సమావేశంలో వైఎస్సార్టీపీ నేతలు సంజీవరావు, గౌతం ప్రసాద్, డానియల్, శాంత్రాజ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.