ఖైరతాబాద్, నవంబర్ 5: పోటీలో ఉంటామని తమను నమ్మించి, ఏకపక్ష నిర్ణయంతో నట్టేట ముంచిన వైఎస్ షర్మిల తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్టీపీ నేతలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యుడు, వనపర్తి ఇన్చార్జి వెంకటేశ్వర్రెడ్డి, షాద్నగర్ ఇన్చార్జి మహ్మద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ.. షర్మిల వైఎస్సార్టీపీని ప్రారంభించినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో ఖర్చుచేశామని చెప్పారు. కానీ, షర్మిల తన నియంతృత్వ నిర్ణయంతో లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు.
కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందం చేసుకొని పుట్టిముంచిందని ఆరోపించారు. షర్మిలకు తెలంగాణ మీద ఎలాంటి అభిమానం లేదని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ సంపాదనే ధ్యేయంగా పనిచేశారని విరుచుకుపడ్డారు. షర్మిల నిర్ణయంతో తూప్రాన్కు చెందిన ఓ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్క వైఎస్సార్టీపీ కార్యకర్త కూడా ఆ పార్టీకి మద్దతు ఇవ్వరని స్పష్టంచేశారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు అయూబ్ ఖాన్, యర్రవరపు రమణ, వెంకటేశ్వర్రెడ్డి, సంజీవరావు, రామలింగారెడ్డి, వెంకట్రెడ్డి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు డేవిడ్, శాంతరాజ్, బానోత్ రాజ్కుమార్, నర్సింహారెడ్డి, లక్ష్మయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.