హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఇరవై ఏడేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దళితుల శిరోముండనం ఘటన కేసులో విశాఖ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుతో పాటు తొమ్మిది మంది నిందితులకు 18 నెలల జైలుశిక్ష, లక్షన్నర జరిమానా విధించింది. తోట త్రిమూర్తులు 1994లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపై దాడులకు పాల్పడ్డారు.
రాజకీయంగా తనకు ఎదురొస్తున్నారనే అకసుతో రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలిగించి, శిరోముండనం చేశారు. దాదాపు 27 ఏండ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు 18 నెలల జైలుశిక్షతో పాటు రూ. లక్షన్నర జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.