నర్సంపేట, డిసెంబర్ 1: ‘వైఎస్ షర్మిలా.. గాయం ఏమైంది? ఇంత తొందరగా మానిపోయే చికిత్స అందుబాటులోకి వచ్చిందా.. మాకూ చెప్పండి’ అని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రశ్నించారు. గురువారం నర్సంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల కింద నర్సంపేటలో జరిగిన ఘటనలో వైఎస్ షర్మిలకు గాయమైందని టీవీల్లో చూపారని, తీరా మొన్న టీవీల్లో చూస్తే ఆ గాయం మాయమైందని ఎద్దేవా చేశారు. ఆమె గాయం ఏమైందో గవర్నర్ ఆమెను అడగాలని కోరారు.
తెలంగాణలో ఇలాంటి డ్రామాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ‘తెలంగాణను షర్మిల అఫ్గానిస్థాన్తో పోల్చారు. మీరు అఫ్గానిస్థాన్కు గవర్నర్గా ఉన్నారా? లేక తెలంగాణకు ఉన్నారా? ఈ మాటపై తెలంగాణ గవర్నర్గా కచ్చితంగా స్పందించాలి. తెలంగాణ సీఎంను తాలిబాన్గా పోల్చడాన్ని రాష్ట్ర గవర్నర్గా మీరు సమర్థిస్తారా? అని గవర్నర్ను ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేసుకోవాలని హితవు పలికారు. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.