డ్రగ్స్కు బదులు యువత కొత్త దారులు
షెడ్యూల్ హెచ్-1 డ్రగ్స్ అమ్ముతున్న ముఠాలు
అనస్థీషియా ఇంజెక్షన్లతో ఫార్మా డీలర్ల వ్యాపారం
మూతపడ్డ మెడికల్ షాపులే కేంద్రంగా నిర్వహణ
ఎక్సైజ్, పోలీసుల సోదాల్లో అనేక కొత్త కోణాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకొని యువత మత్తులో జోగుతున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మూతపడిన మెడికల్ దుకాణాలు ఈ మత్తు గోలీలు, సూదులకు అడ్డాగా మారుతున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు, పోలీసులు గుర్తించారు. షెడ్యూల్ హెచ్-1 డ్రగ్స్ అయిన నైట్రోవిట్, ఆల్ఫ్రాజోలం, ట్రెమడాల్ వంటి కొన్ని రకాల ట్యాబ్లెట్లను డాక్టర్లు నొప్పి నివారణకు, మరికొన్నింటిని మానసిక రుగ్మతులు ఉన్నవారికి నిద్ర వచ్చేలా సూచిస్తుంటారు. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మెడికల్ దుకాణాల్లో విక్రయించాలి. కానీ, అమ్మే ముఠాలు, కొనే యువత ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం కోడ్ లాంగ్వేజ్లను సైతం వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఓ నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రకాల మత్తు ట్యాబ్లెట్లను వాటి పేరుతో కాకుండా ‘10 ఎంజీ.. 5 ఎంజీ అని పిలుస్తున్నట్టు తెలిసింది. రెండు రోజుల కిందట ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది ఏసీగార్డ్స్లో రైడ్ చేసి ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరు గతంలో రాజ్భవన్ రోడ్డులో మెడికల్ షాప్ నిర్వహించేవారు. ఇప్పుడు మెడికల్ షాప్ లేకున్నా గతంలో తీసుకొన్న లైసెన్స్తో మెడికల్ ఏజెన్సీల నుంచి నైట్రోవిట్ ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్లను తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారు.
ట్యాబ్లెట్ షీట్ వెయ్యి.. ఇంజెక్షన్ 15 వేలు
రూ.110 ఉండే 15 ట్యాబ్లెట్ల షీట్ను రూ.500 నుంచి రూ.1,000 వరకు అమ్ముతున్నట్టు తెలిసింది. కొందరు తయారీ కంపెనీల నుంచి, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి వీటిని తెప్పించి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి షెడ్యూల్ హెచ్-1 డ్రగ్స్.. కంపెనీలో తయారీ నుంచి అవి ఏ ఏజెన్సీకి వచ్చాయి? ఏ మెడికల్ షాప్నకు వెళ్లాయి? ఏ కస్టమర్కు విక్రయించారు? అన్న ప్రతి అంశంపై ఆడిట్ ఉండాలి. కానీ, ఆ నిఘా ఉందటం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ఆదివారం హైదరాబాద్లోని మల్లేపల్లి, అత్తాపూర్, గోపన్పల్లి ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ సోదాల్లోనూ వందల ట్యాబ్లెట్లు దొరికాయి. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇక.. శస్త్రచికిత్సల్లో వాడే అనస్థీషియా ఇంజెక్షన్లను కూడా మత్తు జల్సాకు ఉపయోగిస్తున్నట్టు తేలింది. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్మరు. కేవలం దవాఖానల్లోనే దొరుకుతాయి. ఈ ఇంజెక్షన్లకు సంబంధించి వైద్యులు ప్రిస్కిప్షన్ కూడా రాయరు. కానీ, కొంత మంది ఫార్మా డీలర్లే అక్రమంగా బయటికి తీసుకొచ్చి తెలిసిన వారితో విక్రయిస్తు భారీగా సంపాదిస్తున్నారు. రాచకొండ పోలీసులు ఓ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ సహా ముగ్గుర్ని అరెస్టు చేసి విచారించగా ఈ బాగోతం బయటపడింది. ఏడాది కాలంగా 5 ఎంఎల్ ఇంజెక్షన్ను రూ.15 వేలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. మత్తు కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా మత్తు వినియోగాలపై డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.