జగిత్యాల : యువత పఠనాసక్తి పెంచుకొని విజ్ఞాన వంతులుగా ఎదగాలని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎస్హెచ్ గార్డెన్స్లో వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన సదస్సుకు ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్, ఆంగ్లభాషా నిపుణుడు డాక్టర్ ఎం చిరంజీవి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుపతి కుమార్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వీరేంద్రనాథ్ గొప్ప రచయిత అని, వెండితెరకూ ఆయన కథలు అందించి మెప్పించారని కొనియాడారు.
విజయానికి 5 మెట్లు అనే పుస్తకంతో యండమూరి సమాజంలో సంచలనం సృష్టించారని అన్నారు. యువతలో వ్యక్తిత్వ వికాసం పెంపొందినప్పుడే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. ఆంగ్లభాష ఉన్నతికి చిరంజీవి చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటి ప్రొఫెసర్ తిరుపతి కుమార్ ఇంగ్లిష్, పారిన్ భాషల్లో నిష్ణాతులని వీరందరూ కరీంనగర్ వాస్తవ్యులు కావడం గర్వకారణమని చెప్పారు. అనంతరం యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. కరీంనగర్లో తాను రాసిన పుస్తకాలకు మంచి ఆదరణ లభించిందని అన్నారు. పిల్లలో జ్ఞానం, ధైర్యం సమానంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు తపన, స్ఫూర్తి, దీక్షతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ సిందూశర్మ, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.