రోడ్డు సమస్య పరిష్కారానికి వెళ్లినందుకు..
ఆగ్రహంతో స్థానికుడి పెట్రోల్ పిచికారి
మంటలంటుకొవడంతో ఎంపీవోకు గాయాలు
సారంగాపూర్, మే 10: రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడి చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణరాజు గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో మంగళవారం చోటుచేసుకొన్నది. తుంగూర్ గ్రామ బస్టాండ్ సమీపంలోని బీడీ కార్మికుల కాలనీ రోడ్డు విషయంలో గత కొన్నేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ స్థలం తనదంటూ అదే కాలనీకి చెందిన చుక్క గంగాధర్ రోడ్డుకు అడ్డంగా బండలు, కట్టెలు పెడుతూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాడు.
స్థానికులు పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, మంగళవారం అధికారులు గ్రామానికి వెళ్లారు. డీఎల్పీవో కనకదుర్గా, తాసిల్దార్ ఆరీఫొద్దీన్, ఎంపీవో రామకృష్ణరాజు, ఎస్సై గౌతమ్, సర్పంచ్ గుడిసె శ్రీమతి గ్రామంలోకి వెళ్లి కాలనీవాసులతో మాట్లాడి, రోడ్డుకు అడ్డంగా వేసిన కట్టెలు, బండలు తొలగించారు. విషయం తెలుసుకొన్న చుక్క గంగాధర్ పురుగుల మందు స్ప్రే చేసే డబ్బాలో పెట్రోల్ నింపుకొని వచ్చి అక్కడున్న అధికారులు, కాలనీ వాసులపై స్ప్రే చేసి లైటర్తో నిప్పంటించడంతో మంటలు చెలరేగా యి. అక్కడే ఉన్న ఎంపీవో రామకృష్ణరాజుకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా, గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పెట్రోల్తో దాడి జరిగిన విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతున్న ఎంపీవో పరామర్శించారు. అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనను కరీంనగర్ జిల్లా ఎంపీడీవోల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
దాడి అమానుషం
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తుంగూరులో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడి అమానుషమని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం (టీఎన్జీవోస్) అధ్యక్షుడు మహేశ్ అన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.