మెట్పల్లి: ఇంట్లో ఒక మనిషి దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం..! ఆ వ్యక్తి తాలూకూ జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తూ గుండెలు తరుక్కుపోతాయి..! మనసు భారమవుతుంది..! తన్నొకొచ్చే దుఃఖాన్ని ఆపడం వశం కాదు..! చిన్న పిల్లల్లా భోరున ఏడ్వాలనిపిస్తుంది. చివరికి ఏడిస్తేనే భారం దిగిపోతుంది..! అలాంటిది ఒకే ఇంట్లో గంటల వ్యవధిలో రెండు ప్రాణాలు పోతే.. ఆ ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములైతే.. ఇద్దరూ మూడు పదుల వయసులోనే ఉన్న యువకులైతే.. ఆ కుటుంబం పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది..? ఎంత ఘోష అనుభవిస్తుంది..? వాళ్లను నమ్మి వచ్చిన ఆడబిడ్డలు ఎంత విలవిల్లాడుతారు..? వాళ్లను కన్న పేగులు ఎంత తల్లడిల్లిపోతాయి..?
తలచుకుంటేనే గుండెలు కూలిపోతున్నాయి కదా..? శత్రువుకు కూడా అలాంటి కష్టం రావద్దు అనిపిస్తుంది కదా..? కానీ, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో అలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. గంటల వ్యవధిలోనే సొంత అన్నదమ్ములిద్దరూ మృత్యువు ఒడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసే భోగ శ్రీనివాస్ (32) అనే వ్యక్తి శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. దాంతో అతడిని స్వస్థలమైన మెట్పల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాస్ భౌతిక కాయాన్ని శ్మశానానికి తరలిస్తుండగా శ్మశాన ప్రవేశ ద్వారం దగ్గరే అతని అన్న భోగ సచిన్ (35) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దాంతో కుటుంబసభ్యులు, బంధువులు అతడిని తీసుకుని మెట్పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీశారు. నాలుగు ఆస్పత్రులకు వెళ్లినా ఆదివారం కావడంతో ఒక్క ఆస్పత్రిలో కూడా వైద్యులు అందుబాటులో లేరు. చివరికి మెట్పల్లిలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు.
ఆ మాట వినగానే కుటుంబసభ్యుల కాళ్ల కింద భూమి కదిలిపోయింది. గుండెలు అవిసేలా రోధించారు. ఇక అన్న భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చే సరికి బంధువులు తమ్ముడి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇప్పుడు అన్న అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భోగ నాగభూషణంకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు సచిన్ కోరుట్ల కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి ఇంకా పిల్లలు కాలేదు. అతని తమ్ముడు భోగ శ్రీనివాస్కు 15 నెలల పాప ఉంది. ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు.
ఇక మూడో కొడుకు భోగ అరవింద్ ఒక్కడే ఆ ఇంటికి దిక్కు. నిన్నటి దాకా ముగ్గురు కొడుకులతో కళకళలాడిన ఇల్లు.. విధి చిన్నచూపు చూడటంతో ఒక్కసారిగా కళ కోల్పోయింది. ముగ్గురిలో ఇద్దరు కొడుకులు గంటల వ్యవధిలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వెలవెలబోయింది. అందుకే అంటారేమో విధిరాతను మార్చడం ఎవరి తరమూ కాదని..!