హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): ఆమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న హైదరాబాద్, నారాయణగూడకు చెందిన ప్రతీక్ష కున్వర్(24) అక్టోబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ప్రియాంక, స్నేహితుడు సాయితేజ, డ్రైవర్ వరుణ్తో కలిసి ప్రతీక్ష కారులో వెళ్తుండగా డ్రైవర్ సిగ్నల్ను గుర్తించకపోవడంతో చెనీ లేక్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొని ప్రమాదం సంభవించిందని మృతురాలి సోదరి ప్రతిభా కున్వర్ తెలిపారు. వరుణ్, సాయి తేజ, ప్రియాంకకు గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రతీక్ష మృతదేహాన్ని తీసుకురావడానికి భారత కాన్సులేట్ జనరల్ను సంప్రదిస్తున్నటుచెప్పారు.