హైదరాబాద్,నవంబర్26(నమస్తే తెలంగాణ): ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి తాను చనిపోతూ ఐదుగురికి పునర్జన్మనిచ్చింది. అవయవదానం ద్వారా వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక శ్రీకాకుళం పట్టణంలోని ఓ సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 22న మౌనిక బైక్పై వెళ్తుండగా రోడ్డుప్రమాదం జరిగి ఆమె తలకు బలమైన గాయమైంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె బ్రెయిన్డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెను శ్రీకాకుళంలోని జెమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అవయవదానంపై అక్కడి సిబ్బంది మౌనిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో వారు ముందుకొచ్చారు. మౌనిక అవయవాలను గ్రీన్చానల్ ఏర్పాటు చేసి కొద్దిగంటల వ్యవధిలోనే తరలించారు. మౌనిక గుండెను రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం తరలించి, అక్కడి నుంచి విమానంలో తిరుపతి స్విమ్స్కు తరలించారు. ఒక కిడ్నీని అదే దవాఖానలోని ఓ రోగికి అమర్చగా, మరో కిడ్నీని విశాఖలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. రెండు కండ్లను రెడ్క్రాస్ సంస్థకు అందించారు.