నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) ఊర్కొండ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర్కొండ మండలంలోని ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి శనివారం సాయంత్రం వచ్చారు. దర్శనం అనంతరం రాత్రి నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా, అక్కడ మాటువేసిన యువకులు ఆమెను అడ్డుకున్నారు. యువతి బంధువుపై దాడిచేసి చేతులు కట్టేశారు. ఆమెను బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగారు. నిందితులను ఊరుకొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మందిగా గుర్తించారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.