జగిత్యాల (బీర్పూర్) : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు సమస్య పరిష్కారానికి వచ్చిన అధికారులతో పాటు గ్రామస్తులపై ఓ పెట్రోల్తో దాడి చేశాడు ఓ ప్రబుద్ధుడు. మంటలు చేలరేగి.. ఓ అధికారికి గాయాలవగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో బీడీ కాలనీ వెళ్లే రోడ్డు విషయంలో కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతున్నది. కాలనీ మొదటల్లో ఉన్న ఇంటి యజమాని చుక్క గంగాధర్ అనే వ్యక్తి కాలనీకి వెళ్లే రోడ్డు తనదని, అందులో నుంచి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ పేచీపెడుతూ వస్తున్నాడు.
గత ఆరేళ్లుగా సమస్య కొనసాగుతున్నది. పలుమార్లు గంగాధర్ కాలనీకి వెళ్లే రహదారిలో బండరాళ్లు, కర్రలు, ట్రాక్టర్లు అడ్డం పెడుతూ రాకపోకలకు ఇబ్బందులు సృష్టించాడు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని, రోడ్డు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని పలుసార్లు కాలనీవాసులు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు గంగాధర్ను పిలిపించి.. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినా గంగాధర్లో మార్పు కనిపించలేదు. వారం కిందట కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తూ మళ్లీ రోడ్డుపై కర్రలను అడ్డుగా పేర్చాడు.
దీంతో కాలనీవాసులు ప్రజావాణిలో కలెక్టర్కు సమస్యను విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని బీర్పూర్ తహసీల్దార్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్ అరిఫోద్దీన్, ఎస్ఐ గౌతమ్, ఎంపీవో రామకృష్ణ రాజు, సర్పంచ్ గుడిసె శ్రీమతిజితేందర్, గ్రామస్తులు సంబంధిత రోడ్డు వద్దకు వెళ్లారు. రోడ్డుపై గంగాధర్ పెట్టిన బండరాళ్లను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగాధర్ ఇంట్లోకి వెళ్లి పవర్ స్ప్రేయర్లో పెట్రోల్ పోసి అధికారులు, గ్రామస్తులపై స్ప్రే చేశాడు.
దీన్ని గమనించిన ఎస్ఐ సదరు వ్యక్తిని నిలువరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో గంగాధర్ లైటర్ను వెలిగించడంతో పెట్రోల్తో తడిసిన ఎంపీవో రామకృష్ణ రాజుకు మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఎస్ఐ వెంటనే ఎంపీఓను రక్షించి, చికిత్స కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గంగాధర్ను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఘటనలో గాయపడ్డ ఎంపీవోను జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ పరామర్శించారు.