Koheda | వారిద్దరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా జన్మించింది. కానీ, నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి కర్కశంగా వదిలేసి మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ దారుణ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొహెడలో నివాసముండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడిని సరిత అనే యువతి నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా అతడిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక బిడ్డ పుట్టగా ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది.
ఈ విషయంలో గోవర్ధన్ సరితను ఎన్ని సార్లు బతిమాలినా తనతో వచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దీంతొ తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన గోవర్ధన్ ఎంతకు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతడి సోదరి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకొని గోవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దు అంటూ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అమ్మేసిన బిడ్డ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.