హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బ్లూకాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాలని, ఆ దిశగా యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. గురుకుల, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి రేవంత్రెడ్డి హాజరయ్యారు. “అన్న-అక్క మెంటార్షిప్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను గవర్నర్ చేయించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, విద్యావ్యవస్థను ఆ దిశగా నడిపించేందుకు బడ్జెట్లో 8.5 శాతం నిధులు కేటాయించామని అన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నానని, ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇంగ్లిష్తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నామని, ఐటీఐలను ఏటీసీలుగా మార్చామని వివరించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నంప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, సలహాదారులు కే కేశవరావు, షబ్బీర్అలీ, వీ హనుమంతరావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రచారం కోసం చిన్నారులతో చెలగాటం
ప్రభుత్వం రాజకీయ ప్రచారం కోసం చిన్నారులతో చెలగాటమాడుతున్నదని విద్యార్థి, ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి గురుకులాల, కేజీబీవీలు, పాఠశాలల విద్యార్థులను టార్గెట్లు విధించి మరీ 15 వేల మందిని తీసుకువచ్చారు. అయితే ఇక్కడ కనీస వసతులు కల్పించలేదు. మధ్యాహ్నం జోరుఎండలో, టెంట్ల కింద విద్యార్థులు పడిగాపులు కాశారు. తీరా కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులెవరికీ కిట్లను పంపిణీ చేయలేదు. నామమాత్రంగా ఒక్కో గురుకులం నుంచి ఒక్కో విద్యార్థికి మాత్రమే కిట్ ఇచ్చారు.