ఇచ్చోడ(సిరికొండ), ఫిబ్రవరి 16 : వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం భీంపూర్కు చెందిన దుర్వ సుంగు(30) తన పేరుపై ఐదెకరాలు, తండ్రి పేరు మీదున్న పదెకరాలు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పంటలు పండకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు ఎలా తీర్చాలని తన తండ్రితో చెప్పి బాధపడేవాడు.
ఈ నెల 15న జొన్న పంట కాపలా కోసం తన తండ్రి దుర్వ సోనేరావుతో కలిసి వెళ్లాడు. తండ్రి నిద్రిస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పురుగులమందు తాగాడు. గమనించిన తండ్రి.. సుంగు నోటి నుంచి నురుగరావడంతో కుటుంబీకుల సాయంతో రిమ్స్కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై కాత్లే రమేశ్ తెలిపారు.