హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు తొలుత మొత్తం బిల్లును గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుందని సివిల్ సైప్లె అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ ధర రూ.955 ఉన్నది కాబట్టి లబ్ధిదారులు తొలుత ఆ మొత్తం చెల్లించాలని వివరిస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వం రూ. 500 పోను మిగతా సొమ్మును గ్యాస్ కంపెనీలకు చెల్లిస్తుందని, అనంతరం గ్యాస్ కంపెనీలు సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తాయని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్ సిలిండర్పై రూ.40 సబ్సిడీ అందజేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్కు రూ.415 చొప్పున ఇస్తే సరిపోతుందనే అంచనాలేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో పట్టణానికీ, పట్టణానికీ మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల తెల్లరేషన్ కార్డులు, 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం అమలులో భాగంగా సివిల్ సైప్లె అధికారులు తెల్ల రేషన్కార్డులు ఉన్న లబ్ధిదారుల లెక్కలు తీయగా అధికారికంగా 65 లక్షల మంది అర్హులుగా తేలినట్టు సమాచారం. కానీ, ప్రస్తుతం 40 లక్షల మందినే అర్హులుగా గుర్తించినట్టు సమాచారం. ఈ 40 లక్షల మందిని ఏ ప్రాతిపదికన గుర్తించారనే విషయంపై స్పష్టతలేదు. అర్హులలో ఎవరెవరున్నారో తెలుసుకోవడం ఎలాగో ప్రభుత్వం కనీసం స్పష్టతనివ్వలేదు.