Voter Card | వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ తెలిపారు. కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారణకు పంపిణీ చేసిన ఓటరు స్లిప్లు చూపిస్తే సరిపోదని, ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులను చూపించాలన్నారు.
ఆధార్కార్డు, ఎంఎన్ఆర్జీఏ జాబ్కార్డు, పోస్టాఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్కార్డు, ఇండియన్ పాస్పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు, ఏదైనా ఒక గుర్తింపు కార్డులను తీసుకొని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ పేర్కొన్నారు.