వెంకటాపూర్, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సోమవారం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 30 పురాతన కట్టడాల్లో యోగా వేడుకలు జరుగనున్నాయని, వీటిలో రామప్ప దేవాలయంతోపాటు వరంగల్ కోట కూడా ఉన్నదని కేంద్ర పురావస్తుశాఖ హైదరాబాద్ ఇన్చార్జి సూపరింటెండెంట్ స్మితాకుమారి వివరించారు. రామప్పఆయంలో సోమవారం ఉదయం 7 గంటలకు యోగా, 7.45 గంటల నుంచి కోలాటం, బోనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ కార్యక్రమాలను తిలకించేందుకు తక్కువ మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు స్మితాకుమారి పేర్కొన్నారు.