హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో శనివారం సాయంత్రం వరుణుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రతాపం చూపించాడు. సాయంత్రం భారీ వర్షం కురిసింది. షేక్పేట, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.
మూడురోజులపాటు వర్షాలు
రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడురోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు దిగువస్థాయిలో వీస్తున్నాయని చెప్పారు. తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 11 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.