మొత్తం ధాన్యం విలువ రూ.9,834 కోట్లు
కేంద్రం కుట్రలు ఛేదించిన సీఎం కేసీఆర్
3 వేల కోట్ల నష్టాన్ని భరించిన ప్రభుత్వం
ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ టాప్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న… ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. వాటన్నింటినీ దీటుగా ఎదుర్కొన్న సర్కారు.. ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసింది. రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం ససేమిరా అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతును అక్కున చేర్చుకొన్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు ఛేదించి.. బీజేపీ రాష్ట్ర నాయకులకు దిమ్మతిరిగేలా యా సంగి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ సీజన్లో 9.42 లక్షల మంది రైతుల నుం చి మొత్తం 50.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ రూ.9,834.87 కోట్లు. రైతులను కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యా న్ని కొంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్.. బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్గా మార్చటం వల్ల వచ్చే నష్టాన్ని కూడా భరించేందుకు సిద్ధమయ్యారు. ఈ విధంగా రూ.3 వేల కోట్లకు పైగా నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లా నుంచి రూ.1,252 కోట్ల విలువైన 6.42 లక్షల టన్నుల ధాన్యాన్ని సర్కారు కొన్నది. ధాన్యం కొనుగోళ్లు ముగియటంతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,609 కొనుగోలు కేంద్రాలను మూసివేసింది.
ఎన్నో సవాళ్లు
యాసంగి ధాన్యం కల్లాల్లోకి వచ్చి చేరినా కొనుగోలుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకొన్నది. అయితే ఇందుకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. గన్నీలు, ట్రాన్స్పోర్ట్, మిల్లర్లతో ఒప్పందం, నిధులు ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. ధాన్యం నిల్వ కోసం గన్నీ సంచుల సేకరణ ప్రధాన సమస్యగా మారింది. కొత్త గన్నీ సంచులు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన సంచులను రాష్ట్ర ప్రభుత్వమే సేకరించింది.
పత్తాలేని బండి
యాసంగిలో తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేయటంతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ముందుజాగ్రత్తగా వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. ప్రతిపక్షాలు మాత్రం రైతులతో రాజకీయం చేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులను రెచ్చగొట్టి వరి సాగు చేయాలంటూ పిలుపునిచ్చారు. బండి సంజయ్ అయితే ‘మీరు వరి సాగు చేయండి. కేంద్రంతో ప్రతి గింజ కొనుగోలు చేయించే బాధ్యత నాది’ అని బీరాలు పలికారు. తీరా ధాన్యం చేతికొచ్చేసరికి పత్తా లేకుండా పోయారు.
రైతుల పట్ల సీఎం ప్రేమకు నిదర్శనం
కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కుట్రలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులను కాపాడుకొన్నది. రైతుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు ధాన్యం కొనుగోళ్లు నిదర్శనం. మన రైతుల కోసం రూ.3 వేల కోట్లకు పైగా నష్టం భరించేందుకు సిద్ధమయ్యారు. రైతులను రెచ్చగొట్టిన ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయి.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి