50.67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
రైతులకు 9,680 కోట్లు చెల్లింపులు
ధాన్యం కొనుగోలులో దేశంలో రికార్డు
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సేకరణ ముగిసిందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బును రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఈ యాసంగి సీజన్లో రూ.9,916 కోట్ల విలువైన 50.67 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. దాదాపు 9.52 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.9,680 కోట్లు సకాలంలో వారి బ్యాంకు అకౌంట్లలో వేశామని చెప్పారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6,42,894 టన్నులు, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 322 టన్నుల ధాన్యం సేకరించినట్టు వెల్లడించారు.
2014-15 సీజన్ నుంచి ఇప్పటి వరకు ఎంఎస్పీ ప్రకారం పంటల సేకరణ చేప్పటినట్టు చెప్పారు. కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలుగకుండా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రం పోటీరాలేదని అన్నారు.