హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల నిర్మాణం, విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో యాసంగి సాగు బ్రహ్మాండంగా సాగుతున్నది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇది యాసంగి సీజన్లో రెండో అత్యధిక సాగు కావడం విశేషం. తొలిసారి 2020-21 యాసంగిలో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.
ఇప్పుడు ఈ రికార్డును తిరగరాసే దిశగా పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్ ముగింపునకు నెలరోజులే ఉండటంతో మరో 4-5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం సాగు విస్తీర్ణంలో వరి రికార్డుగా నిలువనున్నది. ఇప్పటివరకు సుమారు 45 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మరో 8 లక్షల ఎకరాల్లో సాగైతే వరి సాగులో తెలంగాణ సరికొత్త రికార్డును నమోదు చేయనున్నది. 2020-21లో అత్యధికంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
తెలంగాణ, ఉమ్మడి ఏపీలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిరుడు కేంద్రం ఆంక్షలు, ఇబ్బందుల కారణంగా కొందరు రైతులు వరి సాగుకు దూరమయ్యారు. అయితే సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడం, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్తు ఇస్తుండటంతో మళ్లీ వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వరి తర్వాత మొక్కజొన్న 5.60 లక్షల ఎకరాలు, శనగ 3.55 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.30 లక్షల ఎకరాలు, జొన్న లక్ష ఎకరాలు, మినుము 45 వేల ఎకరాల్లో సాగయ్యాయి.