హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా 6.28 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో 5.75 లక్షల ఎకరాల్లో వరి సాగే ఉండడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 72.58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈసారి మాత్రం 66.30 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
అదే విధంగా వరి సాగు పరిశీలిస్తే గతేడాది 56.44 లక్షల ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం ఇది 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు సాగు నీళ్లు లేకపోవడంతో సుమారు 15 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.